హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రూపొందించిన ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని బతుకమ్మ కానుకగా అందించనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్టు చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లోని వైద్య పరికరాల నిర్వహణ కోసం హైదరాబాద్లోని టీఎస్ఎంఎస్ఐడీసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్’ను (పీఎంయూ), ఈ-ఉపకరణ్ పోర్టల్ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానల్లో రూ.వందల కోట్లతో వైద్య పరికరాలు సమకూర్చామని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో మరిన్ని పరికరాలు రాబోతున్నాయని, వీటి నిర్వహణకు ప్రత్యేకంగా రూపొందించిన ‘ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ’ (ఏఎంసీ) శనివారం నుంచి అమల్లోకి వస్తున్నదని వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు.
సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కాల్ సెంటర్ 8888526666 ఏర్పాటు చేశామని, లేదా సూపరింటెండ్లు నేరుగా ఈ-ఉపకరణ్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదు ఇక్కడి నుంచి సంబంధిత కంపెనీకి వెళ్తుందని, వారు వెంటనే స్పందించి మరమ్మతులు పూర్తి చేస్తారన్నారు. రూ.5 లక్షలకుపైగా విలువైన పరికరాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,020 ఉన్నాయని, వీటన్నింటినీ ఏఎంసీ పరిధిలోకి తెస్తున్నామన్నారు.
మందుల కొరత రావొద్దనే ఉద్దేశంతో ఈఎంఎల్, ఏఎంఎల్ జాబితాను సవరించామని మంత్రి హరీశ్రావు తెలిపారు. గతంలో 720 రకాల మందులు ఉంటే ఇప్పుడు 843కు పెంచామని, వీటి కొనుగోలు త్వరలో ప్రారం భం అవుతుందని చెప్పారు. ఔషధాల కొనుగోలుకు ఈ ఏడాది బడ్జెట్లో సీఎం కేసీఆర్ రూ. 500 కోట్లు కేటాయించారని, ప్రభుత్వ జాబితాలో లేని, అత్యవసర ఔషధాల కొనుగోలు కోసం బడ్జెట్లో 20%.. అంటే రూ.100 కోట్ల ను సూపరింటెండెంట్ల దగ్గర ఉంచామని వివరించారు.
ఔషధాల నిర్వహణకు ఈ-ఔషధి పోర్టల్ను ప్రారంభించామని, కనీసం 3 నెలల స్టాక్ ఉండేలా పోర్టల్ సహాయపడుతుందని చె ప్పారు. రాష్ట్రంలో 18 ఏండ్లకు పైబడినవారం తా కరోనా బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలు, వైద్యశాఖ అధికారులు, డాక్టర్లు, సిబ్బంది కృషి ఫలితంగా రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. గత ఏడాది ఆగస్టులో 62 శాతం సిజేరియన్లు జరుగగా.. ఈ ఏడాది జూలైలో 56 శాతానికి తగ్గాయని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో 47.24 శాతం నుంచి 45.92 శాతానికి తగ్గగా, ప్రైవేట్ దవాఖానల్లో 80.98 శాతం నుంచి 78.86 శాతానికి తగ్గించగలిగామని వివరించారు. మరోవైపు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి 33 శాతం ప్రసవాలు మాత్రమే జరుగగా, ఇప్పుడు 66 శాతానికి పెరిగాయని చెప్పారు.
ఎన్ఎంసీ ఇటీవల సీట్లు రద్దు చేసిన మూడు మెడికల్ కాలేజీల్లో.. టీఆర్ఆర్ కాలేజీ విద్యార్థులను సర్దుబాటు చేయాలని ఉ త్తర్వులు వచ్చాయని మంత్రి హరీశ్ తెలిపారు. వారిని మంగళవారంలోగా కౌన్సిలింగ్ నిర్వహించి సర్దుబాటు చేస్తామని చెప్పారు. మిగితా రెండు కాలేజీల విద్యార్థులకు సైతం న్యాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నామని, ఉత్తర్వులు రాగానే సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజల వణాలతో కూడిన న్యూట్రిషన్ కిట్ విలువ రూ.2వేలు ఉంటుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. గర్భిణులకు 3వ నెలలో, 6వ నెలలో ఈ కిట్ అందజేస్తామని, వీటితో పోషకాహార లోపం తగ్గడమే కాకుండా సిజేరియన్లు తగ్గుతాయని, మాతాశిశు మరణాలను నియంత్రించవచ్చని చెప్పారు. లక్షన్నర మందికి న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ‘బిడ్డ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్.. బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్’ అందిస్తూ అండగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.
న్యూట్రిషన్ మిక్స్డ్ పౌడర్ (హార్లిక్స్) 2 బాటిళ్లు (ఒక్కొక్కటి కిలో చొప్పున)
ఖర్జూర ఒక కిలో.. నెయ్యి 500 గ్రాములు
ఐరన్ సిరప్ 3 బాటిళ్లు
ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు ఒక కప్పు