మేడ్చల్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): బీసీల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి మల్లారెడ్డి బీసీ కుల వృత్తుల 200ల మంది లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని పంపిణీ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, బీసీ కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ఆర్థిక సహాయం పథకం ప్రారంభినట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పొందిన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశలో ఎక్కడా? ఏ రాష్ట్రంలో కూడా లేవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని సౌకర్యాలతో పాటు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే బెస్ట్ సీఎం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీసీ సంక్షేమాధికారి కేశురాం, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు.