శంషాబాద్ రూరల్, డిసెంబర్ 27 : రైతుల సంక్షేమానికి కేసీఆర్ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం కృషి చేసిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని మల్కారం గ్రామంలో సహకార సంఘం చైర్మన్ బుర్కుంట సతీశ్ ఆధ్వర్యంలో రూ.1.12లక్షల నాబార్డ్ నిధులు, రూ.20లక్షలు సహకార సంఘం నిధులతో నూతనంగా నిర్మించిన గోదాంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వం పెద్దపీట వేసిందని వివరించారు.
మల్కారంలో రెండు ఎకరాల స్థలంలో గోదాంతో పాటు సహకార సంఘం కార్యాలయం నిర్మించామన్నారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సాగునీటికి ఇబ్బందులు లేకుండా మిషన్కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత లాంటి పథకాలతో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని వివరించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. త్వరలో జరుగబోయే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని నాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ సత్తయ్య, డీసీసీడీ డైరెక్టర్లు బాల్రెడ్డి, అంజిరెడ్డి, సహకార సంఘం చైర్మన్ బుర్కుంట సతీశ్, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, సర్పంచ్లు దండు ఇస్తారి, మాధవి యాదగిరిరెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ ప్రభుసాగర్, డైరెక్టర్లు బాల్రాజ్గౌడ్, శివాజీ, సత్తయ్య, శంకరయ్య, నాయకులు, గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
మల్కారం సహకార సంఘం ఆధ్వర్యంలో రైతుల కోసం మరో రెండు గోదాంలను నిర్మిసాం. అందుకు అవసరమైన నిధులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. సహకర సంఘంలో వ్యవసాయానికే కాకుండా బంగారంపైన కూడా రుణాలు ఇస్తున్నాం.ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– సతీశ్, సహకార సంఘం చైర్మన్