సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : శానిటేషన్ కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని, వారికి దక్కాల్సిన హక్కులు, సదుపాయాలను సమకూర్చాలని జాతీయ సఫాయి కర్మచారి చైర్మన్ వెంకటేశన్ అన్నారు. శనివారం జీహెచ్ఎంసీని సందర్శించిన ఆయనకు బల్దియాలోని కార్మిక సంఘాలు, కార్మికులు వినతి పత్రాలను అందజేశారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమానికి జీహెచ్ఎంసీ చేపట్టిన కార్యాచరణను బల్దియా కమిషనర్ రొనాల్డ్ రాస్ వివరించారు.
కార్మికుల జీతభత్యాలు, సమయపాలన, ఈఎస్ఐ, యూనిఫాం, వైద్య సదుపాయాలు, పని దినాల గురించి అడిగి తెలుసుకున్నారు. బీఓటీ టాయిలెట్లు, సులభ్ కాంట్రాక్టులు ఇవ్వడం లేదని, ఆయా కాంట్రాక్టులను రీకాల్ చేసి మేతకాని కార్మికులకు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా జాతీయ మేతకాని వాల్మీకి శ్మశాన వాటిక నిర్మాణానికి రూ.79లక్షలు మంజూరు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు ఉపేందర్ రెడ్డి, సరోజ, జోనల్ కమిషనర్లు వెంకటేశ్, అభిలాష అభినవ్, వెంకన్న, రవికిరణ్, సీఎంఅండ్హెచ్ఓ డా.పద్మజ, డా.రాంబాబు, ఎస్బీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.