చిన్నాపెద్దా సహా ఇంట్లో ఎవ్వరూ కంటిచూపు సమస్యలతో బాధపడకుండా వారి ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రెండో విడుత ‘కంటి వెలుగు’కు సన్నాహాలు చేస్తున్నది. ఈ నెల 18 నుంచి జూన్ 30 వరకు నిర్వహించే రెండో దశ ‘కంటి వెలుగు’ కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 91 వార్డుల్లో 115 శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కమిటీ హాళ్లు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ మైదానాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. కంటి వైద్యుడు, ఫార్మసిస్ట్, ఆశా వర్కర్.. ఇలా పది మందితో కూడిన బృందం ప్రతిరోజు ఉదయం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య సేవలు అందించనున్నది. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించే కంటి వెలుగుపై మంత్రి తలసాని, మేడ్చల్-మల్కాజిగిరిలో జరిగే కార్యక్రమంపై మంత్రి మల్లారెడ్డి మంగళవారం సమీక్షించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా రికార్డుస్థాయిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ నెల 18 నుంచి జూన్ 30వ తేదీ వరకు నిర్వహించే కంటి వెలుగు రెండో దశ కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 91 వార్డులలో 115 శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో శిబిరాల ఏర్పాటు కోసం కమ్యూనిటీ హాల్స్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ గ్రౌండ్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. శిబిరాల వద్ద సరైన పర్నిచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వృద్ధులను కూడా దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణీదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, కౌసర్ మొహినుద్దిన్, కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, ఎర్రోళ్ళ శ్రీనివాస్, గజ్జెల నగేశ్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, కలెక్టర్ అమోయ్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోశ్, హెల్త్ అడిషనల్ డైరెక్టర్ పద్మజ, హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వంద రోజుల పాటు సేవలు
వంద పని దినాల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటివెలుగు శిబిరాలు కొనసాగుతాయని మంత్రి తలసాని చెప్పారు. ప్రతి టీంలో ఒక డాక్టర్, ఒక కంటి వైద్యుడు, ఒక పార్మసిస్ట్, ఆశా వరర్లతో కలిపి 10మంది వరకు ఉంటారని మంత్రి తెలిపారు. కంటివెలుగు గొప్ప కార్యక్రమమని, గిన్నీస్ బుక్లో నమోదయ్యే విధంగా విజయవంతం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒకరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పేదల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా..!
ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే నిర్వహిస్తుందని మంత్రి తలసాని తెలిపారు. కార్పొరేటర్లు, కాలనీలు, బస్తీల కమిటీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కంటివెలుగు పథకం గురించి వివరించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కంటి పరీక్ష కోసం రూ.300 నుంచి 500 వసూలు చేస్తున్నారని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.