ఎల్బీనగర్, ఏప్రిల్ 17 : రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం పని రోజులు పూర్తి కాగా, అనుకున్న లక్ష్యంలో సగం వరకు పూర్తి చేసింది. మిగతా రోజుల్లో లక్ష్యం పూర్తి చేస్తామన్న ధీమాతో అధికారయంత్రాంగం ముందుకు వెళ్తోంది. కాగా, ఆయా చోట్ల నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను పెద్ద సంఖ్యలో ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంత మంది వచ్చినా నేత్ర వైద్యులు, సిబ్బంది ఓపికగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అప్పటికప్పుడే మందులు, రీడింగ్ అద్దాలు పంపిణీ చేస్తున్నారు. ప్రిస్కిప్షన్ అద్దాలు అవసరమైన వారికి ఆర్డర్లు ఇచ్చి, వచ్చిన వెంటనే అందజేస్తున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమం మొదలైన నాటి నుంచి నేటిదాకా విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో 1,37,411 నివాసాల్లో 83,518 మందికి పరీక్షలు చేయగా 13,892 మందికిపైగా రీడింగ్ గ్లాసులు అందజేశారు. 13,739 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చారు. 4,254 మందికి కంటి శస్త్ర చికిత్సల కోసం సిఫారసు చేశారు. తాజాగా చంపాపేట డివిజన్లోని చంపాపేట మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నుంచి కర్మన్ఘాట్ క్రాంతి క్లబ్లో కంటి వెలుగు పరీక్షా కేంద్రాన్ని మార్చి పరీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి క్రాంతి క్లబ్ కంటి వెలుగు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కంటి పరీక్షలు చేసుకుంటున్న వారిని పలుకరించి కంటి వెలుగు పరీక్షా కేంద్రాల్లో అందుతున్న సేవలను ఆరా తీశారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేసుకున్న వారికి కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా కంటి పరీక్షల కేంద్రాల గురించి ప్రజలకు ప్రచారం చేసి అందరూ కంటి పరీక్షలు చేయించుకునేలా చొరవ తీసుకోవాలని సూచించారు.
కంటి వెలుగు శిబిరాల ద్వారా పరీక్షలు చేసి పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కర్మన్ఘాట్ క్రాంతి క్లబ్లో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకం ద్వారా కంటి చూపు కోల్పోయిన పేదలకు, వృద్ధులకు పరీక్షలు చేసి ఉచితంగా కళ్ల అద్దాలు అందించి వారికి కంటి చూపును అందించిందన్నారు. కంటి పరీక్షలు చేసిన మీదట శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి సరోజినీ కంటి ఆస్పత్రిలో చికిత్సలు చేయించి ఉచితంగా వారికి సేవలు అందిస్తున్నారన్నారు. కంటి వెలుగు పరీక్షలకు విజయవంతం చేయడం ద్వారా తెలంగాణను అంధత్వ రహిత రాష్ర్టాంగా మార్చాలని ఎమ్మెల్యే సూచించారు. ఎల్బీనగర్ నియోకవర్గం వ్యాప్తంగా ఇప్పటి వరకు 83,518 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కర్మన్ఘాట్ క్రాంతి క్లబ్ శిబిరం జూన్ 15వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు శిబిరం డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.