కందుకూరు, జనవరి 12: ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ రెవెన్యూ పరిధిలో భూమి కోల్పోయిన రైతులకు 121 గజాల ప్లాట్లు ఇస్తున్నారు. అందులో భాగంగా గురువారం టీఎస్ఐఐసీ ఎండీ వెంకట్నర్సింహారెడ్డితో కలిసి మంత్రి లే ఔట్ ప్లాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..లేఔట్లో రైతులకు అన్ని వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కేటాయిస్తున్న ప్లాట్లు ఎవరు విక్రయించొద్దని సూచించారు. మొదటగా ఎకరం, అర ఎకరం భూమి కోల్పోయిన రైతులకు డ్రా ద్వారా ప్లాట్లను ఎంపిక చేసిన అనంతరం ప్లాట్ల హద్దులను పాతి వాటికి నంబర్లు వేసి వారికి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. 15రోజుల్లో రైతులకు ప్లాట్లు అప్పగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కోర్టుకు వెళ్లి తిరిగి వచ్చిన రైతులకు కూడా ప్లాటు ఇస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, మీర్ఖాన్పేట్, ఆకులమైలారం, బేగరికంబెల సర్పంచ్లు బ్రాహ్మణపల్లి జ్యోతి చంద్రశేఖర్, కళమ్మ రాజు, సుగుణమ్మ, ఎంపీటీపీ కాకి రాములు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిర్ర సాయిలు, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి పాల్గొన్నారు.