అవే వంకర మాటలు.. ఓర్వలేనితనం.. అవమానించే వ్యాఖ్యలు.. చివరకు తెలంగాణ ప్రజల ఆహార అలవాట్లను కించపర్చడం.. ముడి బియ్యం (రారైస్) మాకిచ్చి.. మీరు నూకలు తినండని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి మాటలకు వ్యతిరేకంగా శుక్రవారం గ్రేటర్వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, ఇతర ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. బీజేపీ నేతల్లారా ఖబడ్దార్.. మేం నూకలు తినడం కాదు.. మీకు నూకలు చెల్లే రోజులు వచ్చాయని హెచ్చరించాయి. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకే కేంద్ర మంత్రులు ప్రేలాపనలు పేలుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్నం పెట్టే రైతులను అవమానించిన గోయల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మళ్లీ ఉద్యమ తడాఖా చూపిస్తామని హెచ్చరించాయి.
కేంద్ర మంత్రిపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. రాష్ట్ర ప్రజలు నూకల అన్నం తినాలని సూచించిన పీయూష్ గోయల్కు నూకలు చెల్లే సమ యం ఆసన్నమైనట్టేనని తెలంగాణ సమాజం మండిపడుతున్నది. ఆహంకార మాటలను వెంటనే వెనక్కి తీసుకొని రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు చుట్టూ నీళ్లు ఉన్నా.. చుక్క నీరు దొరకక ఎడారిలా మారిన తెలంగాణలో నిండుకుండల్లాంటి ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ పండుగలా మారుస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రంగాన్ని అణగదొక్కి దండుగగా మార్చే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
– సిటీబ్యూరో/ మేడ్చల్, మార్చి25(నమస్తే తెలంగాణ)
కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఏం చేసిందో చెప్పాలి. తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడడం సబబుకాదు. కేంద్రమంత్రి గోయల్ చిల్లరగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలన్న బీజేపీకి తగిన బుద్ధి చెబుతాం. కేంద్రం వడ్లు కొనేవరకు పోరాడుతాం.
– మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్నామని, రానున్న రోజుల్లో కర్రు కాల్చి వాత పెడుతామని హెచ్చరించారు. రైతులకు అన్యాయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెబుతామని, రైతుల ఉసురు తగిలి నాశనం అయిపోతుందని శాపనార్థాలు పెట్టారు. వడ్లను కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. దేశ ప్రజలకు న్యాయం చేయడం చేతకాకుంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ జూఠా మాటలను ప్రజలు గమనించి తిరగబడటం మొదలు పెట్టారని, ఇక ఆ పార్టీని పాతాళంలోకి తొక్కడం ఖాయమైపోయిందని తెలిపారు. వడ్ల కొనుగోలుపై ఇలానే నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాల గడ్డ ఉరుమై గర్జిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపిస్తామని రైతులు తెలిపారు. అస్తిత్వం, యాస, భాషలను అవమాన పరుస్తూ కల్లుతాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్న బీజేపీ నాయకులకు తగినబుద్ధి చెప్పేందుకు తెలంగాణ సమాజం జాగృతమవుతుందని పలువురు మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యమకారులు చెబుతున్నారు.
సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమిటో? రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చ జరుపుదామని, హైదరాబాద్ వచ్చి తమతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడటం సబబు కాదని అన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు కావని, తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాటలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చీము, నెత్తురు ఉంటే.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలి అన్న పీయూష్ గోయల్తో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లు కొనే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలు నూకలు తినడం అలవాటు చేసుకోవాలని వ్యాఖ్యానించడం సరికాదు. గోయల్ అహంకారంతో పాటు బీజేపీ నేతలకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ బయట పడింది. గోయల్ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలోని బీజేపీ నేతలకు జనమే తగిన గుణపాఠం చెబుతారు.
– మర్రి రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి
గోయల్ మాటలతో రాష్ట్ర ప్రజలపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి బయటపడింది. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశంగా విభజించి పాలిస్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను నూకలు తినాలని వ్యాఖ్యానించిన గోయల్ వెంటనే క్షమాపణ చెప్పాలి.
– జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు
అన్నం పెట్టే రైతులను అవమానపర్చడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. గోయల్ తెలంగాణ ప్రజానీకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అహంకారపూరిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్లుగా మంత్రి ప్రకటన చేయాలి. ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు చీము, నెత్తురు ఉంటే మంత్రితో స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పించాలి. ఇట్లనే అవహేళనగా మాట్లాడితే తెలంగాణ సమాజం తిరగబడటం ఖాయం. రాష్ట్రంలో వారి పప్పులు ఉడకవని తెలిసికూడా పాగావేయాలని చూస్తున్నారు. బీజేపీకి భంగపాటు తప్పదు.
– పెరుక శ్యాం, లా విద్యార్థి, ఓయూ
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఉద్యమ దెబ్బ రుచేంటో చూపిస్తాం. అతి సమీప భవిష్యత్తులోనే తెలంగాణలో బీజేపీ నాయకులకు నూకలు చెల్లుతాయ్. ఇప్పటికైనా విభజించి పాలించే కుట్రలను మానుకోవాలి. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కునేలకు రాయాలి. లేదంటే వారిని రాష్ట్రంలో తిరుగనియ్యం. మా తడాఖేందో వారికి తెలియజెప్పాల్సిన సమయం త్వరలోనే రాబోతున్నది.
మంత్రులతో పాటు కాషాయపార్టీ నాయకులు బాధ్యత మరిచి మాట్లాడుతున్నారు. స్వయాన ఆహార మంత్రియే బాధ్యత మరిచి ప్రాంతీయ అసమానతలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం దుర్మార్గం. మా రాష్ట్ర ఆహారపు అలవాట్లతో పాటు ఆరుగాలం కష్టంజేసి పంట పండించిన రైతన్నలనూ అవమాన పర్చే విధంగా మాట్లాడటం సరికాదు. ఇప్పటికైనా కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతులను ఆదుకోవాలి.
– ఆవాల హరిబాబు, పరిశోధక విద్యార్థి, ఓయూ
అప్పుడంటే వడ్లు ఎక్కువగా పండేవి కావు. ఇప్పుడు వడ్లు పండేందుకు అనేక సౌలతులు ఉన్నాయి. వడ్ల దిగుబడి పెరిగింది. ఇప్పుడెందుకు నూకల అన్నం తింటాం. బీజేపోళ్లు ఎనుకటి కాలానికి తీసుక పోతరా. నీళ్ల సౌలతు, రైతుబంధు పథకంతో పంట వేసేందుకు ఖర్చులను ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇస్తున్నరు. రైతులందరూ సంతోషంగా వ్యవసాయం చేస్తున్నరు.
– బోదారి సత్తయ్య, రైతు, పూడూరు
నూకల అన్నం తినే కాలం పోయింది. అప్పటి రోజుల్లో పంటల సాగు కష్టంగా ఉండేది. పండిన పంటలను అమ్మి నూకల అన్నం తినెటోళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. పంటలు బాగా పండుతున్నాయి. వ్యవసాయానికి అవసరమయ్యే అన్ని బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఉచిత కరెంటు, రైతు బంధు పథకం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను రాజులాగా చేస్తుండు.
– పంకర్ల అంజయ్య, రైతు, ప్రతాపసింగారం
వ్యవసాయ రంగ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది. వ్యవసాయరంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపే విధంగా ఇక్కడ ప్రణాళికలు అమలవుతుంటే బీజేపీ నాయకులకు కంటగింపుగా మారింది. అన్నం పెట్టే రైతన్నలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగన్విలేని పరిస్థితి వస్తుంది.
– కంటం కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు
రైతులు, ప్రజలు కలిసి బీజేపీ నేతలను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉంది. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి గోయల్ వ్యాఖ్యానించడంతోనే బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని తెలుస్తున్నది. రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మించి సాగు నీరు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడం సరికాదు. సీఎం కేసీఆర్సారు తీసుకునే నిర్ణయాలకు రైతులందరం ముందుంటాం.
– ఆనంద్, రైతు, అలియాబాద్
రాష్ట్రంలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే. వడ్లు కొనుగోలు చేయలేని పరిస్థితి వస్తే రైతులకు మద్ధతుగా ప్రజలందరూ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నది. కేంద్ర మంత్రి గోయల్పై రైతులు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. పంజాబ్కు ఒక న్యాయం.. తెలంగాణకు ఒక న్యాయమా.? వడ్లు కొనేవరకు కేంద్ర ప్రభుత్వంపై రైతుల పక్షాన ఉద్యమిస్తాం.
– మధుకర్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గోల్మాల్ మాట్లాడుతున్నారు. ఆయనకు తెలంగాణ చరిత్ర తెలువది. నూకలతోపాటు రాగులు, జోన్నలు, కొర్రలు ఇట్లా అనేక రకాల బలమైన ఆహారం తిన్న చరిత్ర మాది. బ్రహ్మాండంగా కష్టంజేసి, న్యాయం కోసం కొట్లాడిన చరిత్ర తెలంగాణ సమాజానిది. బీజేపీ నేతలందరూ.. తినే పద్ధతి, వేష, భాషల గురించి మాట్లాడుతూ.. తెలంగాణపై ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారు. దక్షిణ భారతదేశాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు. అది వారి తరంకాదు. తిక్క మాటలు మాట్లాడితే ఇక్కడ కుదరదు. ఇక ప్రజలు క్షమించే స్థితిలోలేరు. తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. – లియో అగస్టిన్, ప్రముఖ న్యాయవాది