బంజారాహిల్స్, అక్టోబర్ 30: నమ్ముకున్న నాయకులతో పాటు ప్రజలను నట్టేట ముంచే కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిని సోమవారం ఎమ్మెల్యే మాగంటి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కట్టెల శ్రీనివాస్ యాదవ్తో పాటు వెళ్లి సమావేశమయ్యారు. సుమారు అరగంట సేపు నియోజకవర్గంలోని పరిస్థితులపై చర్చించారు. గత ఎన్నికల్లో 52వేల ఓట్లు సాధించిన తనకు కాదని నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేని అజారుద్దీన్కు టికెట్ ఇవ్వడంలో పీజేఆర్ కుటుంబాన్ని దెబ్బతీసే కుట్ర దాగి ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి సొంతపార్టీ పెద్దలను సైతం ఎదిరించిన మహానేత పీజేఆర్ అభిమానులు, తెలంగాణ వాదుల సత్తా ఏంటో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చూపిస్తామని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. తెలుగుయువత అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచీ పీజేఆర్ను రాజకీయాల్లో దగ్గరనుంచి గమనిస్తున్నానని, ఆయన పోరాటస్ఫూర్తి చాలా గొప్పదన్నారు. అలాంటి పీజేఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని, సీఎం ఆదేశాలకు అనుగుణంగా విష్ణువర్ధన్రెడ్డికి తామంతా అండగా నిలబడతామని ఎమ్మెల్యే మాగంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.