సిటీబ్యూరో, జనవరి 23(నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ పరిధిలో కొనసాగుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జేఎన్టీయూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా 2024-25 విద్యా సంవత్సరంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ అఫ్లియేషన్ల కోసం ఈ సారి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలుపుతున్నారు. అయితే, కాలేజీలకు అనుమతులు ఇచ్చే క్రమంలో ఏఐసీటీఈ నిబంధనలు అందరు పాటించాల్సిందే అని అంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన విద్యా విధానం అందుబాటులోకి తీసుకురావడంలో జేఎన్టీయూ కృషి చేస్తుందన్నారు. అయితే ఉద్యోగ ఉపాధే లక్ష్యంగా నూతన కోర్సులను తీసుకురావడంతో పాటు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ గ్రూపులను ఎలాంటి విఘాతం కలుగకుండా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తు అవసరాలు తీర్చే విధంగా కూడా ఇంజినీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని యూనివర్సిటీ అధికారులు, ఆయా విభాగాల అధిపతులు, బోధనా సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.