సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : ఐటీ కంపెనీల్లో విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తే కంపెనీల్లో జరిగే కార్యకలాపాలను నేర్చుకొని నైపుణ్యం కలిగిన విద్యార్థిగా కళాశాల నుంచి బయటకు వస్తారని, అలాంటి వారికి సత్వరమే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. బుధవారం హెచ్ఐసీసీలో జరిగిన హైసియా (హైదరాబాద్ సాప్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) జాతీయ సదస్సు, అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఏఐ- సెలబ్రేటింగ్ ది ప్యూచర్’ థీమ్తో నిర్వహించిన ఈ సదస్సులో జయేశ్ రంజన్ మాట్లాడుతూ కళాశాలల్లో చివరి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు 3, 6, 9 నెలల పాటు ఆయా కంపెనీల్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి, వారికోసం మెంటార్లను నియమించాలని సూచించారు.
దీంతో విద్యార్థులు మళ్లీ కొత్తగా కోచింగ్ తీసుకోవడం, అనుభవం కోసం రకరకాల మార్గాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉండదని, విద్యా సంవత్సరం అయిపోతుండగానే నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగావకాశం వచ్చేలా చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రతి అంశంపై ఏఐ ప్రభావం చూపుతున్నదని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అత్యంత ప్రభావంతమైన టెక్నాలజీగా మారిందన్నారు. గత ఏడాది కాలంగా ఏఐతో వస్తున్న అప్లికేషన్లు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఏఐను అన్ని రంగాల్లో వినియోగించేలా రకరకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ.గుర్ణానికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ అధ్యక్షుడు వి.రాజన్న, సెయింట్ సీఈఓ కార్తిక్ నటరాజన్, బీసీజీ ఎండీ సౌరభ్ చంద్ర, హైసియా అధ్యక్షురాలు మనిషా సాబూ, ఎస్టీపీఐ డైరెక్టర్ సి.కవిత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ఇందులో ఫర్టిలైజర్ లేయింగ్ మిషన్ను రూపొందించిన శీలం సత్యనారాయణ రెడ్డి, త్రివిల్లర్ మొబైల్ మల్టీ క్రాప్ థ్రెషర్ మిషన్ను రూపొందించిన మహ్మద్ మైనుద్దీన్, మోద పెడల్ ఆపరేటింగ్ మిషన్ ఫర్ హ్యాండ్ లూమ్ను రూపొందించిన శివకుమార్ మోదకు అవార్డులు దక్కాయని టీఎస్ఐసీ ప్రతినిధి ప్రణయ్ తెలిపారు.