బేగంపేటలోని వడ్డెరబస్తీలో జలమండలి ఎండీ దాన కిశోర్ పర్యటన
నీటి నాణ్యతను గుర్తించి.. నల్లాకు ట్యాప్లు బిగించిన అధికారులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ )/మాదాపూర్ : మాదాపూర్ గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో ఆదివారం జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవల ఈ బస్తీ ప్రజలు అనార్యోగానికి గురైన నేపథ్యంలో ఎండీ దానకిశోర్ ఇంటింటికీ వెళ్లి ప్రజల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కాలనీలో పర్యటించి డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ వ్యవస్థను పరిశీలించారు. కాలనీ ప్రజలతో కలిసి మంచినీటి పైపులైన్, డ్రైనేజీ ఒకేచోట ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. లీకేజీలు ఉన్నాయా.! పరిశీలించారు. అనుమానం ఉన్న చోట మరమ్మతు పనులు చేపట్టారు. ఎయిర్టెక్ మిషన్ సహాయంతో డ్రైనేజీ పైపులైన్ను శుభ్రం చేయించారు. బస్తీలో సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఈ సందర్భంగా ఎండీ ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నీటి నాణ్యతను పరీక్షించాలని సూచించారు.
అన్ని నల్లా కనెక్షన్లకు ట్యాప్ల బిగింపు..
గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో 69 నల్లా కనెక్షన్లకు ట్యాప్లు (నల్లాలు) లేవని జలమండలి అధికారులు గుర్తించారు. సగానికి పైగా నల్లా గుంతలు మరుడుదొడ్ల పక్కనే ఉన్నట్లు అధికారుల పర్యటనలో బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే వడ్డెర బస్తీలో అన్ని నల్లా కనెక్షన్లకు ట్యాప్లను బిగించారు. ఈ కార్యక్రమంలో ఈడీ సత్యనారాయణలతో పాటు జనరల్ మేనేజర్ రాజశేఖర్, డీజీఎం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి బ్యాక్టీరియా లేదు..
వడ్డేర బస్తీలోని వేర్వేరు ఇండ్లనుంచి సేకరించిన నీటి నమూనాలను క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ ల్యాబరేటరీ కి పంపించామని.. పరీక్షల్లో అన్ని నమూనాల్లో తగిన మోతాదులోనే 0.5పీపీఎం రెసిడుయల్ క్లోరిన్ ఉందని తేలిందని జలమండలి అధికారులు తెలిపారు. నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని వెల్లడైందని, ఈ నీరు తాగేందుకు సురక్షితమైనదిగా పేర్కొన్నారు.