అమీర్పేట్, నవంబర్ 22: కార్పొరేట్ విద్యా సంస్థల పోటీని తట్టుకుని, తమకు ఉన్న వనరులతో విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలకు తాను అండగా ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. బుధవారం బల్కంపేటలోని ఏకేగౌడ్ ఫంక్షన్ హాలులో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్ హాజరై మాట్లాడారు. కరోనా విపత్కర సమయంలో చిన్న ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొన్న కష్టాలను పరిష్కరించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేస్తున్న ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు, అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం సామరస్యపూర్వకంగా పరిశీలించి పరిష్కరిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, యాజమాన్యాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని కోరారు. ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ఉపాధ్యాయులకు అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేట్ కొలను లక్ష్మిరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్రావు, సుధాకర్, ప్రశాంత్, వెంకట పవన్, ప్రసాద్, అల్తాఫ్ హుస్సేన్, పవన్, సోమసుందర్ పాల్గొన్నారు.