బంజారాహిల్స్,ఏప్రిల్ 29: ఖైరతాబాద్ నియోజకవర్గంలో గంటన్నరపాటు వాన దంచికొట్టింది. భారీ వర్షంతో పలు బస్తీలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన వర్షం ఆరున్నరకు ఆగింది. ఈ గంటన్నర వ్యవధిలో అనేక ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో రోడ్లపై పెద్దఎత్తున వరదనీరు నిలిచిపోయింది. లోతట్టు బస్తీల్లో వరదనీరు ఇండ్లలోకి చేరింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివిజన్ల పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. షేక్పేటలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్లో 5 సెంమీ, టోలీచౌకిలో 4.3, జూబ్లీహిల్స్లో 5.2, ఫిలింనగర్ 4.2 , పంజాగుట్టలో 3.4, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో 4.8, వెంకటేశ్వరకాలనీ 3.6 సెంటీమీటర్ల వర్షం పడింది. అనేక బస్తీల్లోని రోడ్లుదెబ్బతినగా కొన్ని ప్రాంతాల్లో పాత గోడలు నేలకూలాయి.
ఫిలింనగర్లోని వినాయక్నగర్, బండారు బాల్రెడ్డినగర్, దీన్ దయాళ్నగర్ తదితర ప్రాంతాల్లో వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి, బస్తీలో ఇటీవలే సివరేజ్లైన్ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డును తవ్వడంతో ఆకస్మాత్గా కురిసిన భారీ వర్షంతో రోడ్డంతా దెబ్బతింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లోని దేవరకొండ బస్తీలో చైతన్య అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. ఎటువంటి ప్రాణహాని జరుగలేదు.
కుండపోతగా కురుస్తున్న వర్షంలోనే జీహెచ్ఎంసీ సర్కిల్-18 సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. స్పెషల్ మాన్సూన్ బృందం సభ్యులు పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై నిలిచిపోయిన వరదనీటిని తొలగించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని ఒమేగా సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు కొన్ని ప్రాం తాల్లో భారీగా వరదనీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షంలోనే విధులు నిర్వహిస్తూ వరదనీరు సాఫీగా వెళ్లేలా చూశారు. కేబీఆర్ పార్కు చుట్టూ వర్షపునీటిని పంప్సెట్లను ఉపయోగించి తొలగించారు. ఫిలింనగర్ని వినాయక్నగర్లో వ్యర్థాలు, బురద రోడ్లపై చేరడంతో ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జేసీబీతో పనులు చేపట్టారు. జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి దేవరకొండ బస్తీలో ఇల్లు కూలిన ప్రాంతాన్ని సందర్శించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
హిమాయత్నగర్ : నగరంలో శనివారం కురిసిన భారీ వర్షానికి హిమాయత్నగర్ డివిజన్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కింగ్కోఠి, హిమాయత్నగర్, నారాయణగూడ, హైదర్గూడ, లిబర్టీ తదితర ప్రాంతాల్లో బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులపై వర్షపు నీటితోపాటు మురుగు నీరు పొంగిపొర్లడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ హిమాయత్నగర్ డివిజన్ నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుని బస్తీలు, కాలనీలు, రోడ్లపై నిలిచిన వర్షపు నీరును తొలగించేందుకు చొరవ చూపారు.జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్త కుండా సహాయక చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ ప్రేరాజ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి సుతారి, నాయకులు ఎన్.గణేశ్ ముదిరాజ్, రాజేందర్కుమార్, ప్రభాకర్గౌడ్, నందు, శ్రీనాథ్, రాజేంద్రప్రసాద్, హజర్, మర్రికృష్ణ పాల్గొన్నారు.