శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 3: ఐటీ కారిడార్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… యూసుఫ్గూడ శ్రీరాంనగర్కు చెందిన సులేమాన్ బిన్ అబుబాకర్ అలియాస్ వసీం(31), మెహిదీపట్నం హుమాయున్నగర్కు చెందిన షేక్ అర్మాన్ అలియాస్ మోసిన్ చిక్కి (34), బంజారాహిల్స్ జహీరానగర్కు చెందిన అర్కామ్ హుస్సేన్ (27) రెండేండ్లుగా గోవా, బెంగళూర్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలోని పబ్లలో విక్రయిస్తున్నారు. నోవాటెల్ ఆర్టీస్ట్రీ, ఎయిర్ లైవ్ పబ్, క్లబ్రోగ్ పబ్బుల్లో కొకైన్ను గ్రాము రూ. 15 వేలు, ఎండీఎంఏ గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నారు.
ఈ క్రమంలో క్లబ్లో నిజాంపేటకు చెందిన మిథున(37)తో సులేమాన్కు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో డ్రగ్స్ను ఆమెకు ఉచితంగా ఇచ్చేవాడు. మిథునతో పాటు ఆమె స్నేహితులకు సులేమాన్ డ్రగ్స్ విక్రయించేవాడు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సులేమాన్ మిథునను వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన ఆమె వేధింపులు తట్టుకోలేక బాచుపల్లి షీటీంను ఆశ్రయించి వారి సూచన మేరకు టీఎస్ న్యాబ్ సిబ్బందిని కలిసింది. జనవరి 30న బెంగళూర్కు వెళ్లిన సులేమాన్ అబుబాకర్ అక్కడ అజీం అనే వ్యక్తి వద్ద 10 గ్రాముల కొకైన్, 13 గ్రాముల ఎండీఎంఏను కొనుగోలు చేశాడు. ఫిబ్రవరి 2న మిథున 2 గ్రాముల కొకైన్ కావాలని అర్డర్ చేయడంతో ఐటీ కారిడార్లోని మైహోం విహాంగా ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో మిథునకు కొకైన్ను అందజేశాడు.
అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న టీఎస్ న్యాబ్, ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.26 లక్షలు విలువచేసే 10 గ్రాముల కొకైన్, 13 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్స్తో పాటు స్కోడా కారు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సులేమాన్, అర్మాన్, అర్కామ్లతో పాటు డ్రగ్స్ వినియోగిస్తున్న మిథునలను అరెస్టు చేశారు. ఆ సమయంలో డ్రగ్స్ కొనేందుకు వచ్చిన కేపీహెచ్బీ కాలనీకి చెందిన కొనగళ్ల ప్రియ(36), బంజారాహిల్స్ ట్రెండ్సెట్ విల్లాస్కు చెందిన చల్లా చైతన్యలకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో సంబంధమున్న గోవాకు చెందిన ఉస్మాన్, బెంగళూర్కు చెందిన అజీం, ముషీరాబాద్కు చెందిన అబ్దుల్లా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.