Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై వార్షిక నివేదిక విడుదల కార్యక్రమం సోమవారానికి వాయిదా పడింది. ఒడిశా రైలు ప్రమాదం ఘటన కారణంగా ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
షెడ్యూల్ ప్రకారం టీ హబ్లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేటీఆర్ విడుదల చేయాల్సి ఉండే. కానీ రైలు ప్రమాదం కారణంగా ఆ ప్రోగ్రామ్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రంగం ప్రగతి నివేదికను కేటీఆర్ సోమవారం విడుదల చేయనున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఐటీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఐటీ రంగంలో ఎగుమతులతో పాటు, ఉద్యోగ అవకాశాలపై ఏటా క్రమం తప్పకుండా కేటీఆర్ ఐటీ రంగంపై వార్షిక నివేదికను విడుదల చేస్తున్నారు. తాజాగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని, పదో వసంతంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో విడుదల చేస్తున్న ఈ ఐటీ వార్షిక ప్రగతి నివేదిక ఎంతో ప్రత్యేకమైందని అధికారులు పేర్కొన్నారు.
In light of the Tragic train accident, event has been deferred to Monday https://t.co/l6CQlcjiZ0
— KTR (@KTRBRS) June 3, 2023