మేడ్చల్, జూలై 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రం సిద్ధించి, మనదైన ప్రత్యేక పాలన రావడంతోనే తెలంగాణ ప్రాంత చెరువులకు మహర్దశ పట్టుకున్నది. పూడిపోయిన, నీళ్లు లేక బీళ్లుగా మారి పడావు పడ్డ చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు మన సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక రచించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని, రేపటి అభివృద్ధిని కాంక్షిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక దృష్టి సారించి ‘మిషన్ కాకతీయ’తో వాటికి మరమ్మతులు చేపట్టి, నీళ్లు నిలిచేలా అభివృద్ధి చర్యలు చేపట్టారు. దీని వల్లే చెరువుల్లో చేరిన నీటిని తట్టుకునేందుకు అవి దీటుగా మారి సాగుకు నీరందించేందుకు నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురిసిన వానల వల్ల చెరువులు నిండగా అధికమైన నీరు అలుగుల ద్వారా వెళ్లిపోయింది. దీని ద్వారా చెరువులకు ఎలాంటి నష్టం జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెరువుల అభివృద్ధికి మిషన్ కాకతీయ పథకం ద్వారా దశల వారీగా నిధులు కేటాయించి మరమ్మతులు చేసి చెరువులను బలంగా చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 489 చెరువులు ఉండగా, ప్రభుత్వం మంజూరు చేసిన రూ.40 కోట్ల నిధులతో దశల వారీగా అభివృద్ధి(మరమ్మతులు) చేస్తున్నారు. మిషన్ కాకతీయ పథకంలో చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం 20 శాతం చెరువుల అభివృద్ధికి ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు మరమ్మతులు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 230 చెరువులు అభివృద్ధి అయినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో ఆయకట్టు 25.136 ఎకరాలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని 489 చెరువుల ఆయకట్టు 25.136 ఎకరాల ఆయకట్టు ఉంది. 100 ఎకరాల పైన ఉన్న 50 చెరువులకు 16. 943 ఎకరాల ఆయకట్టు ఉండగా, 100 ఎకరాల లోపున్న చెరువులు 439 ఉండగా, 8.193 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటి వరకు కురిసిన వానలతో 305 చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. మిగతా చెరువులు 85 శాతానికి పైగా నిండినట్లు అధికారులు పేర్కొన్నారు.
మిషన్ కాకతీయతో చెరువులు పటిష్టం
మిషన్ కాకతీయ పథకంతో చెరువులు పటిష్టం అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. దీని ద్వారా పలు గ్రామాలలో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. అంతే కాకుండా నిండిన చెరువులతో వ్యవసాయ రంగం అభివృద్ధితో పాటు చేపల పెంపకంతో మత్స్య కార్మికులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. భారీగా వానలు పడ్డ చెరువులకు ఎలాంటి నష్టం వాటిళ్లలేదు.
– మధుకర్ రెడ్డి, వైస్ చైర్మన్, డీసీఎంఎస్
చెరువుల పునరుద్ధరణ వల్లే నష్టం జరగలేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులను అభివృద్ధి చేయడం వల్లే ఎన్ని వానలు పడినా చెరువులకు ఎలాంటి నష్టం జరగడం లేదు. గతంలో ఎన్నో చెరువులు చిన్న వానలకే బుంగలు పడి, గండ్లు పడి నీళ్లు లేకుండా పోయేవి. సాగుకు చుక్క నీరు లేక గతంలో రైతులు విలవిలలాడిపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం చెరువులు నిండి వ్యవసాయానికి చెరువుల నుంచి మంచిగా నీళ్లు అందుతున్నాయి. వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు లేవు.
– హరిబాబు గౌడ్, పోతాయిపల్లి
చెరువుల ప్రాధాన్యతను తెల్సిన సీఎం మన కేసీఆర్ సారు
చెరువుల ప్రాధాన్యతను నాడే గుర్తించిన సీఎం మన కేసీఆర్ సారు. ముఖ్యమంత్రి ముందుచూపు వల్లే నేడు చెరువులకు జలకళ సంతరించుకున్నది. చెరువులను అభివృద్ధి చేయడం వల్ల చెరువులు నేడు బొడ్డేరులను తలపిస్తున్నాయి. చెరువులలో నీళ్లు పుష్కలంగా ఉండటంతో భూగర్భ జాలలు సమృద్ధిగా పెరిగి సాగు నీటి సమస్య లేకుండా పోయింది. వ్యవయరంగ అభివృద్ధికి చెరువుల అవసరాన్ని గుర్తించి చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
– సద్ది మాధవరెడ్డి, రైతు, నూతన్కల్