మేడ్చల్, మే 2 (నమస్తే తెలంగాణ): గాజులరామారంలోని 307 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేలా కాంగ్రెస్ నాయకులు నకిలీ ధ్రువీకరణపత్రాలు సృష్టించి భూ భారతి పోర్టల్లో దరఖాస్తులు చేయడంపై జిల్లా కలెక్టర్ మను చౌదరికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిషేధిత జాబితాలో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్కు చెందిన ఇద్దరు నాయకులు తమకు చెందిన భూమిగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి భూ భారతి పోర్టల్లో చేసిన దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. 307 సర్వే నంబర్గల ప్రభుత్వ భూమిని ఎస్ఎఫ్ఐకి గతంలోనే కేటాయించారు.
అయితే ఈ సర్వే నంబర్లో ఉన్న భూమి అంతా ప్రభుత్వానికి చెందినదిగా ఉండటమే కాకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. అయినా ఈ భూమిపై అక్రమంగా హక్కులు పొందేలా ప్రయత్నిస్తూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ధ్రువీకరణ పత్రాలు నకిలీవి అని తేలితే మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామనిఅధికారులు చెప్పారు.