సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : నగరానికి మణిహారంలాంటి ఔటర్ రింగ్రోడ్డులో మరో ఇంటర్చేంజ్ ఏర్పాటు కానుంది. సులువు ప్రయాణానికి రింగ్రోడ్డు అత్యంత అనుకూలం కావడంతో నిత్యం వేలాదివాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీనిచుట్టూ కొత్తకొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీంతో శివారు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా మియాపూర్ నుంచి బాచుపల్లి మీదుగా దుండిగల్ వెళ్లే మార్గంలో పరిశ్రమలతోపాటు నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. కొత్తగా గేటెడ్ కమ్యూనిటీలు సైతం ఔటర్ చుట్టుపక్కల ఏర్పాటవుతున్నాయి. దీంతో నిజాంపేట-బాచుపల్లి నుంచి మల్లంపేట వెళ్లే ప్రాంతంలో గత 4-5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది.
పటాన్చెరువు-దుండిగల్ మధ్య సుల్తాన్పల్లి వద్ద ఇంటర్చేంజ్ ఉంది. మల్లంపేట, బాచుపల్లి, బౌరంపేట ప్రాంతాలకు దూరంగా ఉండడంతో మల్లంపేట వద్ద అండర్పాస్ నిర్మాణం చేసినా వాహనాలు పైకెక్కేందుకు, దిగేందుకు ర్యాంపులు నిర్మించలేదు. దీంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఔటర్ ఎక్కాలంటే పటాన్చెరువు, సుల్తాన్పల్లి లేదా దుండిగల్ ఇంటర్చేంజ్ల దాకా వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మల్లంపేట-బౌరంపేట మధ్య నూతనంగా ఇంటర్చేంజ్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత శివారు ప్రాంతాలు ఔటర్ దాటి విస్తరిస్తున్నాయి. నగరానికి పశ్చిమాన ఐటీ కారిడార్లో ఓఆర్ఆర్ను దాటి మోకిల, శంకర్పల్లి, ఇటు పటాన్చెరువు, ఇస్నాపూర్, సుల్తాన్పల్లి, మల్లంపేట, బాచుపల్లి ప్రాంతాల్లో ఎంతో వేగంగా నివాస ప్రాంతాలు వెలిశాయి. దానికనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఔటర్పై అవసరమైన చోట కొత్తగా ఇంటర్చేంజ్లను నిర్మించాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సర్వే నిర్వహించి,కొత్తగా ఇంటర్చేంజ్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లో కొత్తగా రెండు ఇంటర్చేంజ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే మల్లంపేట-బౌరంపేట చుట్టుపక్కల ఇంటర్చేంజ్ నిర్మిస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. త్వరలో ప్రణాళిక సిద్ధం చేసి ఇంటర్చేంజ్ నిర్మాణం చేపడుతామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
158 కిలోమీటర్ల పొడవున్న ఔటర్ రింగురోడ్డుపై ప్రస్తుతం 19 చోట్ల ఇంటర్చేంజ్లు ఉన్నాయి. 2008 నుంచి దశలవారీగా అందుబాటులోకి వచ్చిన ఓఆర్ఆర్ నిర్మాణం 2018 నాటికి పూర్తిస్థాయిలో చేపట్టారు. ఐటీ కారిడార్లో గచ్చిబౌలి, నానక్రాంగూడ, నార్సింగి, కోకాపేట, కొల్లూరు, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్తగా రెండుచోట్ల ఇంటర్చేంజ్లు నిర్మిస్తుండగా, మరొకటి మల్లంపేట-బౌరంపేటల మధ్య నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఓఆర్ఆర్పై మొత్తం ఇంటర్చేంజ్ల సంఖ్య 22కు చేరనున్నాయి.