సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): పోలీసు సైరన్ మధ్య యథేచ్ఛగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గంజాయి రవాణా చేస్తూ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును లంగర్హౌస్ పోలీసులతో కలిసి టీ న్యాబ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు గ్రేహౌండ్ కానిస్టేబుళ్లతో పాటు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.12 లక్షలు విలువజేసే 44 కిలోల గంజాయి, రూ.కోటి విలువజేసే 4 కార్లు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్లోని ఐసీసీసీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వంకుడోతు వీరన్న(33) ఈఈఈలో డిప్లమా పూర్తి చేశాడు. వ్యసనాలకు అలవాటు పడిన వీరన్న అదే ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ పీఎస్ పరిధిలో రెండు చోరీలు చేసి అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత సూర్యాపేట జిల్లా తనమచెర్ల తండాకు చెందిన తన మేనమామ తేజవత్ చంద(70)తో కలిసి వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాలైన డొంకరాయి, సీలేరు, మలన్గిరి నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలతో 2018 నుంచి గంజాయి సరఫరా చేయడం మొదలు పెట్టాడు.
గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్ల సహకారంతో..
గంజాయి రవాణాకు పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురవుతుండటంతో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న తన మామ తేజవత్ ప్రశాంత్ నాయక్ (27), మరో కానిస్టేబుల్ రాములుతో కలిసి గంజాయి రవాణా కోసం ప్రత్యేక నెట్ వర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరు కానిస్టేబుళ్ల సహకారంతో బినామీ పేర్ల మీద నాలుగు ఖరీదైన కార్లను కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్ ఆటోనగర్లో పోలీస్ వాహనాల మాదిరిగా మార్చివేశాడు. వాటికి పోలీస్ సైరన్ , హారన్ వంటివి ఏర్పాటు చేయించాడు. అంతే కాకుండా గంజాయిని పెట్టేందుకు ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేయించారు. నకిలీ పోలీస్ గుర్తింపు కార్డులు సృష్టించి, కార్లకు పోలీస్ స్టికర్స్ వేయించాడు. గంజాయి రవాణా సమయంలో పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా పోలీసుల అవతారంలో సైరన్ మోగిస్తూ యథేచ్ఛగా గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లతో కలిసి టోల్ ప్లాజాల వద్ద పోలీస్ ఐడీలు చూపించి గంజాయి రవాణా చేస్తున్నాడు.
విమానాల్లో ప్రయాణం..
అంతేకాకుండా.. గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే సమయాల్లో వీరన్న విమానాల్లో ప్రయాణం చేశాడు. తన సొంతూరుకు చెందిన అజ్మీర వీరన్న అలియాస్ లాలు (21), సర్నేని మనోజ్ (20)ను డ్రైవర్లుగా నియమించుకున్నాడు. గూడూరు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మెరుగు మధు(39), మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహ్మద్ జహంగీర్ (40)గంజాయి ట్రాన్స్ పోర్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. పోలీస్ సైరన్తో చెక్ పోస్టులు క్రాస్ చేశాడు. మధ్యమధ్యలో డ్రైవర్లను మార్చుతూ.. గంజాయి ఉన్న కార్లను మహారాష్ట్రకు తరలించాడు. ఒకే రూట్లో కాకుండా విజయవాడ హైవే, వరంగల్ హైవేల మీదుగా హైదరాబాద్ , ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని రవాణా చేశాడు. వైజాగ్ ఏజెన్సీలో రూ.4వేలకు కిలో చొప్పున గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన నిఖిలేశ్కు కిలో రూ.25 వేలకు విక్రయించాడు.
కోట్లకు పడగెత్తిన వీరన్న..
ఈ క్రమంలో గంజాయి వ్యాపారంతో కోట్లకు పడగెత్తిన వీరన్న.. వచ్చిన డబ్బుతో ఐదు ఖరీదైన కార్లు, జేసీబీ వాహనాలు కొనుగోలు చేశాడు. నాలుగు కార్లను గంజాయి రవాణాకు వినియోగించగా.. ఒక కారును తన సొంత ప్రయాణానికి వినియోగించాడు. జేసీబీలను ప్రకాశం జిల్లాలో అద్దెకు ఇచ్చాడు. స్వగ్రామంలో విలాసవంతమైన ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా.. స్థానికంగా ‘మా సూపర్ మారెట్’, మోహినీ వైన్స్లో పార్టనర్ షిప్ తీసుకున్నాడు. ఈ క్రమంలో సుమారు రూ.4 కోట్లకు పైగా విలువైన ఆస్తులను కూడబెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరన్న సంపాదనతో స్థానికులు కూడా అతడితో కలిసి పనిచేశారు. సుమారు 20 మందికి పైగా అతడి వద్ద గంజాయి ట్రాన్స్ పోర్టర్లుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం గంజాయి విక్రయాలు జరిపాడు. ఈ మేరకు వీరన్నకు సంబంధించిన నెట్వర్పై నిఘా పెట్టిన యాంటీ నారొటిక్స్ బ్యూరో (టీన్యాబ్ ) ఎస్పీ సునీతా రెడ్డి ఆధ్వర్యంలో టీన్యాబ్ బృందాలు వీరన్నతో పాటు అజ్మీర్ వీరన్న, సర్నేని మనోజ్, మెరుగు మధు, మరిపెడ తప్లా తండాకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రశాంత్ నాయక్ , ఎల్బీనగర్కు చెందిన మహ్మద్ జహంగీర్ను లంగర్హౌస్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ రాములును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.