నేరస్తులపై ఉక్కుపాదం.. పోలీసులపై పెరిగిన నమ్మకం
పహాడీషరీఫ్, బాలాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో పటిష్టంగా శాంతిభద్రతలు
పహాడీషరీఫ్, జనవరి 3 : ఫ్రెండ్లీ పోలీసింగ్తో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. ప్రజలను భాగస్వాములను చేస్తూ తీసుకుంటున్న కార్యక్రమాలు ఫలిస్తున్నాయి. దీంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. టెక్నాలజీ సహాయంతో నేరగాళ్లు కూడా ఎక్కడున్నా పట్టుబడుతున్నారు. స్థానికంగా శాంతి భద్రతలకు ఢోకా లేకపోవడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి వేగంగా దూసుకెళ్తుంది. సీఎం కేసీఆర్ ఆశయం కూడా ఇదే. ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయే అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతారు. రాష్ట్ర వ్యాప్తంగా అదే జరుగుతోంది. ఇందుకు బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న శాంతిభద్రతలతో తగ్గిన నేరాల సంఖ్య నిదర్శనం.
ఒకప్పుడు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే ప్రజలు భయపడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంతో ఆశించిన ఫలితాలొస్తున్నాయి. మరో వైపు ప్రాంతాల వారీగా సర్వేలు చేశారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలపై అధ్యయనం చేశారు. ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో నేరాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. పోలీసు వ్యవస్థపై కూడా ప్రజల్లో నమ్మకం పెరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని బస్తీల్లో నిత్యం పెంట్రోలింగ్ను పెంచారు. స్థానికుల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేశారు. టెక్నాలజీ సహాయంతో నేరగాళ్లు ఎక్కడున్నా పట్టుకుంటున్నారు. నేరాలు అదుపు చేయడం, నేరగాళ్లను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. సంఘ విద్రోహ శక్తులు, వరుస నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న దుష్టశక్తులపై పీడీ యాక్ట్ను ప్రయోగిస్తున్నారు. పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో నేరాలు తగ్గాయి. దీంతో ప్రజలు ప్రశాంత వాతావరణం జీవనం సాగిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వ్యాపారులు, విద్యావేత్తలు రాష్ర్టానికి వచ్చి వ్యాపార సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.
తగ్గిన నేరాలు..
బాలాపూర్ పోలీస్స్టేషన్లో 2021లో 626 కేసులు నమోదయ్యాయి. 2022లో 576 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులోనూ పెట్టీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. పహాడీషరీఫ్లో 2021లో 587 కేసులు నమోదు కాగా.. 2022లో 749 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మిస్సింగ్ కేసులు అధికంగా ఉన్నాయి.
అభివృద్ధి.. అవగాహనతో..
అభివృద్ధి, ప్రజల్లో అవగాహన పెరగడంతో నేరాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకనాడు కనీస సదుపాయాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. సదుపాయాల కోసం కొట్లాటలు జరిగాయి. నేడు ఆ పరిస్థితిలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చూపిస్తున్న చొరవతో ఎంతో అభివృద్ధి జరిగింది. మౌలిక సదుపాయాలు పెరిగాయి. జనజీవన విధానంలో మార్పులొచ్చాయి. దీంతో ప్రజలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతున్నారు. దీంతో నేరాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.
ప్రజల భాగస్వామ్యంతో నేరాలు అదుపు
ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల అదుపునకు కృషి చేస్తున్నాం. నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. భార్యాభర్తల గొడవలతో వచ్చిన కేసుల్లో, మిస్సింగ్ కేసుల్లో చాలా వారకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటుతో చాలా నేరాలు తగ్గాయి. రాత్రివేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేస్తున్నాం. నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. తదుపరి చర్యలు తీసుకుంటున్నాం. దర్యాప్తు పూర్తి చేసి, కోర్టుల్లో చార్జిషీట్ కూడా దాఖలు చేస్తున్నాం. దీంతో దర్యాప్తు, విచారణలో వేగం పెరుగుతుంది. నిందితులకు శిక్షలు కూడా పడుతాయి.
– సీఐ కిరణ్కుమార్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్