సిటీబ్యూరో/ మేడ్చల్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో 17 దవాఖానల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న ఒక నర్సింగ్హోమ్కు రూ.10వేలు జరిమానా విధించారు. మరో 9 ప్రైవేటు దవాఖానలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. నిబంధనలకు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి హెచ్చరించారు.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, అధికారులు నారాయణరావు, వేణుగోపాల్రెడ్డి అన్నోజిగూడలోని వజ్రా ఆస్పత్రిలో తనిఖీ చేశారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, వైద్య పరికరాలు లేకపోవడం, ఉన్న పరికరాలు పనిచేయక పోవడంతో యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. నర్సింగ్హోమ్లు, డెంటల్ క్లినిక్లు, ఫిజియోథెరపీ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలలో ఐదు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అనుమతి లేకుండా ఆస్పత్రుల నిర్వహణ, సౌకర్యాలు లేకుండా పారిశుధ్య లోపం ఉంటే నోటీసులు జారీ చేసి సీజ్ చేస్తామని వైద్యాధికారులు తెలిపారు. అర్హత లేనివారు వైద్యం చేసినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సంబంధిత ఆస్పత్రిని సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు.