పర్యావరణంపై గొడ్డలి వేటు వేస్తూ కేబీఆర్ పార్కు చుట్టూ వందలాది చెట్లను నరికివేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున శుక్రవారం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కువద్ద ‘సేవ్ కేబీఆర్ ప్రతినిధులు’ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ‘హెచ్సిటీ ప్రాజెక్ట్ కోసం బలైపోయిన భారీ వృక్షాలకు అంత్యక్రియలు’ పేరుతో ప్రదర్శన నిర్వహించారు. కేబీఆర్ ప్రధాన గేటు వద్ద నరికివేసిన చెట్ల మానులతో పాడెను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి క్యాన్సర్ ఆస్పత్రి చౌరస్తా వద్ద ఉన్న పీవీ నర్సింహారావు విగ్రహం దాకా శవయాత్ర నిర్వహించారు.
– బంజారాహిల్స్, జూన్ 5
ఎన్నో ఏండ్లుగా అక్కడున్న చెట్లను నరికివేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. చెట్టు కొమ్మను భూమిలో గొయ్యి తీసి పాతిపెట్టారు. ఇరువైపులా చెట్లను నాటిన పర్యావరణ ప్రేమికులు.. కన్నీటి పర్యంతమవుతూ.. నివాళులర్పించారు. మే 18న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో చెట్ల నరికివేత ఆగినా.. అంతకుముందే వందలాది చెట్లను నరికివేయడం అత్యంత బాధాకరమని సేవ్ కేబీఆర్ ప్రతినిధి విజయ్ ముల్లంగి అన్నారు. ప్రపంచం మొత్తం పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటే.. హైదరాబాద్ నడిబొడ్డున మాత్రం పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ప్రభుత్వం హెచ్సిటీ ప్రాజెక్టును నిలిపివేసి.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, కేబీఆర్ చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ను పరిరక్షించాలని రమ్య మైలవరపు కోరారు. నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత వేడిని కలిగిన నగరాల జాబితాలో భారత్లోని నగరాలు చేరాయని, ఇటీవల రాష్ట్ర అవతరణ వేడుకలను సైతం ఎండవేడిమి కారణంగా కుదించుకోవాల్సిన పరిస్థితికి కారణం విచక్షణారహితంగా చెట్లను నరికివేయడమే కదా అని అన్నారు.