సిటీ బ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం వచ్చిందంటే పరిశ్రమలు పండగ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వరదలు ఎప్పుడొస్తాయోనని ఎదురు చూస్తున్నాయి. రోజుల తరబడి పోగుచేసిన నిల్వ రసాయన వ్యర్థాలను నాలాలు, పారే నీటిలో వదిలేందుకు సన్నద్ధమవుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలు వరద నీటిలోకి విడుదల చేయకుండా కట్టడి చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నది. వర్షాకాలం ఆరంభంలోనే గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈనేపథ్యంలో కాలుష్య కారకాలు వరద నీటిలో కలవకుండా కట్టడి చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆయా పరిశ్రమల యజమానులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా సంబంధిత అధికారులతో పీసీబీ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి తనిఖీలు, పర్యవేక్షణ చేసేవిధంగా దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. కానీ కాలుష్యాన్ని కట్టడి చేసే అంత్యంత పటిష్ఠమైన వ్యవస్థ అయిన కాలుష్య నియంత్రణ మండలిలో అలాంటి వ్యవస్థ లేకపోవడం విస్తుగొలిపిస్తున్నది.
పీసీబీకి ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు సభ్య కార్యదర్శి జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించాల్సి ఉంటుంది. టాస్క్ఫోర్స్ బృందంతో పాటు ఆయా జోనల్ అధికారులు, రీజినల్ అధికారులకు వర్షాకాలంలో కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశనం చేయాలి. రీజినల్ కార్యాలయాల పరిధిలో ఉన్న పరిశ్రమలు, కాలుష్య కారకాలను విడుదల చేసే సంస్థలకు అవగాహన కల్పించే బాధ్యతను అప్పగించాలి. కానీ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అలాంటి చర్యలు తీసుకున్న దాఖాలాలు కనిపించడం లేదు.
అధికారుల నిర్లక్ష్యం… పరిశ్రమల ఇష్టారాజ్యం
పీసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను గాలికొదిలేయడం పరిశ్రమల యజమానులకు వరంలా మారుతున్నది. సాధారణంగా పరిశ్రమలో విడుదలయ్యే వ్యర్థాలను ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి బయటకు వదలాల్సి ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన వ్యర్థాలను సంబంధిత ట్యాంకర్ల ద్వారా కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించాలి. కానీ వర్షాకాలం వచ్చేసరికి ఇదేదీ నిర్ణీత పద్ధతి ప్రకారం జరగడం లేదు. పరిశ్రమల యజమానులు వర్షాకాలం వచ్చిందంటే నిబంధనలు ఉల్లంఘిస్తూ వరద నీటిలోకి ప్రమాదకర వ్యర్థాలను విడుదల చేస్తున్నారు. దీంతో ఏటా నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి.
ఆయా చెరువుల్లోని టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడటంతో పాటు జీవరాశులు చనిపోతున్నాయి. చెరువులు, కాలువల పరీవాహకంలోని పంట పొలాలు కాలుష్యం బారిన పడటమే కాకుండా ప్రజలు ప్రాణాంతక వ్యాధులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన నాలాలైన కూకట్పల్లి, బల్కంపేట, ఫతేనగర్, బాలానగర్ నాలాల్లో ప్రమాదకర రసాయనాలను వదులుతున్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో నగరంలోని చెరువులు, నాలాలతోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ అధికారులతో సమీక్షించి వర్షాకాలంలో పరిశ్రమల వ్యర్థాల విడుదలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఆయా పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించి, వ్యర్థాలను విడుదల చేస్తే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.