బడంగ్పేట, జూన్ 6: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉన్నదని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటీ ప్యాబ్సిటీలో జరిగిన పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను, ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అందిస్తున్న తోడ్పాటు, సులభతరంగా అనుమతులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న విధానాలతో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
మరో హైటెక్ సిటీని తలపించే విధంగా మహేశ్వరం మారుతుందన్నారు. తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణాలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులతో 20వేల కంపెనీలు నెలకొల్పబడ్డాయని, తద్వారా 24 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయన్నారు. సేద్యపు రంగానికి సమాంతరంగా ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నదని అన్నారు. అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్, మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.