సిటీబ్యూరో, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): వేగంగా వృద్ధి చెందుతున్న ఈస్ట్జోన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ‘భవిష్యత్ దిశగా విజయవాడ హైవే’ అనే అంశంపై హైదరాబాద్లోని జెడబ్ల్యు మారియట్ హోటల్లో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో టైర్ 2, టైర్ 3 నగరాలలో సైతం ఐటీ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సూర్యాపేటలో త్వరలోనే 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టెక్స్టైల్ పార్క్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పలు కంపెనీలు ఈ ప్రాంతంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నాయని తెలిపారు.
పోచారంలో చేనేత కార్మికుల సాధికారిత దిశగా కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయని, యాదాద్రి దేవాలయం పరిసర ప్రాంతాలు కూడా పెట్టుబడుల పరంగా ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. జీ స్కేర్ హౌజింగ్ సీఈవో ఈశ్వర్ మాట్లాడుతూ విజయవాడ, వైజాగ్లకు వెళ్లేందుకు హైదరాబాద్- విజయవాడ హైవే సులభతరంగా మారిందని, ఈ మార్గం రియల్ ఎస్టేట్కు కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే త్వరలోనే భారీ ప్రయోజనాలను పొందగలరని సూచించారు. సదస్సులో ఎకనామిక్స్ టైమ్స్ సీనియర్ ఎడిటర్ ఆశుతోష్ సిన్హా, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రామ్ రెడ్డి, సీబీఆర్ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జిప్సస్ పౌల్, బ్లూ కోపా కో-ఫౌండర్ సీఈవో రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.