Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్ మీదుగా వీఎస్టీ వరకు ప్రభుత్వం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి ( VST Steel Bridge ) పనులు చకచకా సాగుతున్నాయి. 2.8 కిలోమీటర్ల పొడవునా 4 వరుసల్లో 443 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మిస్తున్నారు. వచ్చే జూన్ 2(తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నాటికి పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచారు. 2021 జనవరిలో శంకుస్థాపన చేసి 2022 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యం విధించుకున్నప్పటికీ కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలలో స్టీల్ సరఫరాలో ఆలస్యమై పనుల్లో జాప్యం జరిగింది. కాగా 81 ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. వీఎస్టీ వైపున కాంక్రీట్ శ్లాబ్ నిర్మాణమూ వేగంగా జరుగుతున్నది. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అశోక్ నగర్ వైపు గర్డర్ల ఏర్పాటు, శ్లాబ్ పనులను ముమ్మరం చేశారు.
రెండో దశలో 76కోట్లతో 900 మీటర్ల పొడవు, 13.61 వెడల్పుతో రాంనగర్ నుంచి బాగ్లింగంపల్లి ఇండియన్ హుమ్ పైప్ కార్పొరేషన్ వరకు మూడు లేన్ల వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ నుంచి మొదలై ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు నిర్మించతలపెట్టిన ఈ వంతెన దిగగానే మూలమలుపు వస్తుండడంతో ప్లాన్లో స్వల్పమార్పులు చేశారు. ఈ మూల మలుపును తప్పించేలా బ్రిడ్జిని నిర్మించాలని తాజాగా అధికారులు నిర్ణయించారు. రాంనగర్ గరోండ అపార్ట్మెంట్ నుంచి వీఎస్టీ, వీఎస్టీ ఫంక్షన్ హాల్ మీదుగా బాగ్లింగంపల్లి అంబేద్కర్ కళాశాల వరకు వంతెన నిర్మాణాన్ని పొడిగించనున్నారు. ఈ రెండు వంతెనలు పూర్తయితే అత్యధిక రద్దీతో సతమతమయ్యే ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వతంగా చెక్ పడనుంది.