సిటీబ్యూరో, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : పోషకాహార లోపం ముఖ్యంగా మహిళల్లో కనిపించే రక్తహీనతను తీసుకునే ఆహారంతో తగ్గించేలా.. కొత్త రకం బియ్యం వంగడాలకు హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రూపకల్పన చేసింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న పాలిష్ బియ్యం కంటే అధికంగా పోషకాలు, జింక్, రెట్టింపు ప్రోటీన్లు ఉండే ఈ బయోఫోర్టిఫైడ్ బియ్యం త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే నాలుగు రకాల వంగడాలను ఐఐఆర్ఆర్ అభివృద్ధి చేయగా.. వీటిలోని పోషకాలపై జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనం చేస్తున్నది. ముఖ్యంగా ఇందులో వాస్తవిక పోషక విలువలను శాస్త్రీయంగా నిరూపించిన తర్వాత వినియోగంలోకి వస్తాయి.
జింక్, సూక్ష్మ పోషకాలు అధిరంగా..
డీఆర్ఆర్ ధన్ 45, డీఆర్ఆర్ ధన్ 48, డీఆర్ఆర్ ధన్ 49, డీఆర్ఆర్ ధన్ 63 వంగడాలను ఐఐఆర్ఆర్కు చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ సీఎన్ నీరజా నేతృత్వం వహిస్తున్న బృందం పోషకాలు అధికంగా ఉండే కొత్త రకం బయోఫోర్టిఫైడ్ బియ్యాన్ని రూపొందించింది. ఇందులో అధికంగా జింక్, సూక్ష్మ పోషకాలతోపాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.
రెట్టింపు పోషకాలు..
సాధారణ బియ్యం కంటే రెట్టింపు పోషకాలు ఉండే బియ్యంతో ఎన్నో రోగాలను కట్టడి చేయడానికి వీలుంటుందని ఐఐఆర్ఆర్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఎదురయ్యే రక్తహీనత సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని వెల్లడించాయి. సాధారణ పాలిస్డ్ రైస్తో పోల్చితే బయోఫోర్టిఫైడ్ రకంలో ఏకంగా 24శాతం అధికంగా జింక్ ఉంటుందని, అదేవిధంగా 10శాతం ప్రోటీన్లు ఈ వంగడాల్లో ఉంటాయని పేర్కొన్నాయి. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు ఈ రైస్తో చేసిన వంటలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాల కొరత తీరుతుందని భావిస్తున్నాయి. అన్ని నేలల్లో పండించేందుకు వీలుగా ఈ వంగడం ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్ఐఎన్లో అధ్యయనం
ప్రయోగాత్మకంగా పండించిన బయోఫోర్టిఫైడ్ బియ్యంలోని పోషకాలపై జాతీయ పోషకాహార సంస్థలో అధ్యయనం చేస్తున్నారు. సాధారణ బియ్యంతో పోల్చి, ఇందులో పోషక విలువను శాస్త్రీయంగా నిరూపించనున్నారు. అదేవిధంగా ఈ బియ్యాన్ని ఎలుకలకు ఆహారంగా అందించి ఆరోగ్య మార్పులను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ బియ్యం ప్రయోగ దశలో ఉండగా.. ఎన్ఐఎన్ అధ్యయనం తర్వాత అందుబాటులో ఉంటాయి.