కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 11: సీఎం కేసీఆర్ పాలన దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని, యావత్ దేశానికి ఆదర్శంగా పలు పథకాలు నిలుస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన కొత్త ఆసరా పింఛన్ కార్డులను కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి బాల్రెడ్డినగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో 817 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్తో కలిసి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరిపాలించే రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదనే అంశాన్ని తెలంగాణ ప్రజాణీకానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను యావత్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న క్రమంలో, ఇవి చూసి ఓర్వలేక ఆ రెండు పార్టీలకు చెందిన నాయకులు కారుకూతలు కూస్తూ.. సంక్షేమానికి అడ్డుకాలు వేస్తున్న పార్టీలకు ప్రజలు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా ప్రతి లబ్ధిదారుడికి నెలనెలకు తమ ఖాతాలో జమయ్యే పింఛన్లో ఒక్క రూపాయి కూడా కేంద్రానిది లేదని, పూర్తిగా తెలంగాణ రూపాయి అని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ లాంటి పరిపాలన అవసరం ఏర్పడిందని, రాబోయే రోజుల్లో ప్రజలు దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు.
ప్రతి కుటుంబానికి ఆసరా: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
ఆసరా పింఛన్ ఫథకం ద్వారా చేకూరే లబ్ధి ప్రతి కుటుంబానికి అవసరంగా మారిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 36 లక్షల పింఛన్లు పంపిణీ చేస్తుండగా, కొత్తగా మరో 10 లక్షల పింఛన్లు లబ్ధిదారులకు అందజేసినదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం, ఏ పాలకులు చేపట్టలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత మనదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, మాజీ ఎంపీపీ సన్న కవిత, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కిశోర్చారి, సత్తిరెడ్డి పాల్గొన్నారు.