సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో నుంచి పెండ్లి సంబంధాలకు ప్రయత్నించే వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఎక్కువగా నైజీరియన్ సైబర్నేరగాళ్లు ఈ మోసాలకు గతంలో పాల్పడేవారు, ఇలాంటి నేరగాళ్లను వరుసగా అరెస్ట్లు చేయడంతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మ్యాట్రిమోనీ నేరాలు తిరిగి మొదలయ్యాయి. తాజాగా వరుసగా ఇలాంటి మోసాలు జరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. పెండ్లి సంబంధాల కోసం ఆన్లైన్ పోర్టల్స్లో తమ ప్రొఫైల్ను అప్లోడ్ చేసే వారిలాగానే సైబర్నేరగాళ్లు సైతం తమ నకిలీ ప్రొఫైల్తో ఆయా వెబ్సైట్లలోకి ఎంట్రీ అవుతున్నారు.
మ్యాట్రిమోనీ సైట్ల నిర్వాహకులు ప్రొఫైల్స్ను సరిగ్గా పరిశీలించకుండానే ఆన్లైన్ ద్వారానే వారి రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసి ఆయా ప్రొఫైల్స్ను అప్లోడ్ చేసేవారు ఉన్నారు. దీంతో ఈజీగా సైబర్నేరగాళ్లు ఈ మ్యాట్రిమోనీ సైట్లలో తమ నకిలీ ప్రొఫైల్ను అప్లోడ్ చేసి, ఇతర ప్రొఫైల్స్ను చూస్తున్నారు. ఇతర ప్రొఫైల్స్ను చూసి, అందులో వయస్సు ఎక్కువగా ఉన్న వారిని ఎంచుకుంటున్నారు. వివిధ కారణాలతో వయస్సు పెరుగుతున్నా పెండ్లి కాని వారు ఉంటారు, అలాగే కొందరు రెండో వివాహనికి సిద్ధమైన మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయిస్తుంటారు.