Hyderabad | హైదరాబాద్ : ఎన్నో సంవత్సరాల నుండి వరద ముంపునకు గురవుతున్న ప్రజల కష్టాలు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమంతో తొలగిపోతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మినిస్టర్ రోడ్డులోని పికెట్ నాలాపై ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు నాలాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. దీని వలన ఎన్నో సంవత్సరాల నుండి నాలాల పరిసర కాలనీల ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద ముంపునకు గురవుతూ అనేక ఇబ్బందులకు గురయ్యేవారని చెప్పారు. బాధిత ప్రజల సమస్య పరిష్కారం గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. నాలాల వెంట ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు, పూర్తిస్థాయిలో పూడిక తొలగించడం, శిథిలావస్థలో ఉన్న, ఇరుకుగా ఉన్న బ్రిడ్జిల స్థానంలో నూతనంగా విశాలమైన బ్రిడ్జిలను నిర్మించడం వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పికెట్ నాలాపై కరాచీ బేకరీ వద్ద రూ. 10 కోట్ల వ్యయంతో బ్రిడ్జిని నిర్మించి ప్రారంభించడం జరిగిందని మంత్రి తలసాని తెలిపారు. అదేవిధంగా మినిస్టర్ రోడ్డులోని పికెట్ నాలాపై నిర్మించిన బ్రిడ్జిని ఈరోజు ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఇవే కాకుండా బేగంపేటలోని నాలా అభివృద్ధి పనులు, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల మీదుగా మూసీ వరకు ఉన్న హుస్సేన్ సాగర్ నాలా అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులు జరిగిన ప్రాంతాలలో వరదముంపు సమస్య నుండి ప్రజలకు విముక్తి లభించిందని అన్నారు. నగరంలో ఉన్న అన్ని నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈ భాస్కర్ రెడ్డి, ఈఈ శ్రీధర్, జోనల్ కమిషనర్ శ్రీధర్, ఈఈ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.