దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో బుధవారం నగరంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి, పటాకులు పేల్చి.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. గుణాత్మక మార్పునకు.. భారత రాష్ట్ర సమితి
భారతదేశ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగుపడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించారు. అంతకుముందు వేదపండితుల ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్టానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన మాజీ ఎంపీలు, రైతు సంఘాల నాయకులు పాల్గొని కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణకు మీతో కలిసి నడుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ వీధులు గులాబీ మయమయ్యాయి.