నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2015లో డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి నిర్మాణ పనులు పూర్తయిన ఇండ్లను దశలవారీగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5వేల మందికి కేటాయించగా.. తాజాగా 70వేల ఇండ్లను ఆరు విడతల్లో పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఎనిమిది నియోజకవర్గాల్లో తొలి విడతలో ఒక్కో నియోజకవర్గంలో 500 మంది చొప్పున 12వేల మందికి సెప్టెంబర్ 2వ తేదీ నుంచి లక్కీ డ్రా ద్వారా పంపిణీ చేయనున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ) / బన్సీలాల్పేట్ : పార్టీలకతీతంగా అర్ములైన వారందరికీ దశల వారీగా డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసలో ఇటీవల ఎంపికైన 500 మంది డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడారు. పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు లబ్ధిదారులపై ఒక్క పైసా ఖర్చు లేకుండా ఒక్కో ఇంటిని రూ.9.50 లక్షలు ప్రభుత్వమే భరించి ఉచితంగా అందజేస్తున్నదని తెలిపారు. ఇండ్లు రాలేదని ఎవరూ అధైర్యపడవద్దని, దశల వారీగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికి ఇస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఎంపికైన వారికి ఇండ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.
మా అదృష్టంగా భావిస్తున్నాం
చిన్న చిన్న ఇండ్లలో చాలా కష్టంగా జీవిస్తున్నాం. ఎప్పుడో ఆరేండ్ల కింద దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు సడెన్గా ఫోన్ చేసి మీకు ఇల్లు వస్తుందని చెప్పడంతో అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరికీ మేము లంచాలు ఇవ్వలేదు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం మంచి ఆలోచన. ఈ ప్రభుత్వానికి ఋణపడి ఉంటాం.
– అనిత, విశ్వనాథ్
ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాసం నిజమైంది
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. మా కల నెరవేరుతున్నది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాకు వీడియో కాల్ చేసి జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో మీరు డబుల్ బెడ్రూం ఇంటికి ఎంపికయ్యారని చెప్పడంతో మా సంతోషానికి అవదుల్లేవు. సీఎం కేసీఆర్పై మేము పెట్టుకున్న విశ్వాసం నూరు శాతం నిజమైంది.
– కౌసల్య, సత్యనారాయణ
అల్లా దయతో కేసీఆర్ చల్లగా ఉండాలి
ట్యాంక్బండ్ సమీపంలోని ముస్లిం శ్మశానవాటికలో ఎన్నో ఏండ్లుగా చిన్న రేకుల ఇంట్లో ఉంటున్నాం. మాకు ఐదుగురు సంతానం. సొంత ఇల్లు లేక అవస్థలు పడుతున్నాం. లాటరీ ద్వారా మాకు సొంత ఇల్లు మంజూరైందని ఫోన్ చేసి చెప్పారు. చాలా సంతోషంగా ఉన్నది. పేదలకు మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ అల్లా దయతో చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాం.
– పర్వీన్ బేగమ్, తల్లిదండ్రులు
కేసీఆర్కు రుణపడి ఉంటాం
గాంధీ దవాఖానలో ఔట్ సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నా. 30 ఏండ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్నాం. సొంత ఇల్లు కావాలని 2016లో దరఖాస్తు చేసుకున్నాం. రెండు రోజుల కిందట లాటరీలో మాకు ఇల్లు వచ్చిందని ఫోన్ వచ్చింది. ప్రభుత్వం మాకు గూడు కల్పించడం ఆనందంగా ఉన్నది. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మాకు రాలేదు..
– చంద్రకళ, వెంకటరత్నం