మొయినాబాద్, జనవరి 9 : బాకారంలో సమీపంలో సోమవారం దారుణ హత్యకు గురైన యువతి కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసు అధికారులు మంగళవారం కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ కేసులో మృతదేహం వద్ద లభించిన సెల్ఫోన్ కీలక ఆధారంగా మారనున్నది. ఈ సెల్ఫోన్ను పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఓ యువతి (25) ని ఎక్కడో హత్యచేసిన దుండగులు.. సోమవారం పట్టపగలు బాకారం సమీపంలోని రోడ్డుపక్కన మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఫోన్లో లభించే సమాచారంతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అదే విధంగా.. రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చిన మొయినాబాద్ పోలీసులు.. ఎక్కడైనా యువతి మిస్సింగ్ కేసు నమోదైన విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. యువతి మృతదేహం వద్ద లభించిన సెల్ఫోన్లో సిమ్ కార్డు లేదని తెలిసింది. సెల్ఫోన్ ఆధారంగా కూడా కాల్ రికార్డును సేకరించే అవకాశం ఉందని, సీసీ కెమెరాలు ఫుటేజీ, సెల్ఫోన్ ఆధారంగా కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.