Hyderabad| సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు చేపడుతున్న రహదారుల విస్తరణ పనులపై నిధుల ప్రభావం తీవ్రంగా పడింది. ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న బల్దియా.. అభివృద్ధి పనులకు నిధులను కేటాయించలేకపోతున్నది. దీంతో గడిచిన కొద్ది రోజులుగా వివిధ పథకాల కింద జరుగుతున్న రహదారి విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. కొన్ని చోట్ల పూర్తిగా నిలిచిపోగా..మరికొన్ని ప్రాంతాల్లో నత్తనడకన నడుస్తున్నాయి. ఎస్ఆర్డీపీ, సాధారణ రోడ్లు, మిస్సింగ్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులకు జరగాల్సిన రహదారి విస్తరణ పనులతో దాదాపు 150 ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం పడుతున్నది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, కోఠి, గచ్చిబౌలి, ఎల్బీనగర్, రామంతాపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో మరోవైపు వీఐపీల తాకిడి, మరోవైపు నిలిచిన రహదారి పనులతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలవుతున్నది. వాస్తవంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం వెయ్యి కోట్ల మేర భూ సేకరణ పనులు జరగాల్సి ఉన్నది. నిధులు లేకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తిగా అటకెక్కింది. దీని కారణంగా ఎస్ఆర్డీపీలో భాగంగా శిల్పా లే అవుట్ ఫేజ్-2 ఫ్లై ఓవర్ పనులకు భూసేకరణ అంతరాయం ఏర్పడింది. నిర్దేశిత గడువులోగా ఈ ఫ్లై ఓవర్ పూర్తి కావడం అనుమానంగా ఉన్నది. మాడల్ కారిడార్ అభివృద్ధి పనులు కొన్ని చోట్ల జరుగుతుండగా, నాగోల్లో పనులు నిలిచిపోయాయి.
ఆదర్శ్ సొసైటీ, అమెరికన్ కాన్సులేట్ వద్ద లింకు రోడ్డు పనులు తుది దశలో ఉన్నప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారు. బోరబండ సున్నం చెరువు వద్ద లింకు రోడ్డు పూర్తి కాకపోయినప్పటికీ అధికారులు రికార్డులో పూర్తి అయినట్లు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిలకలగూడ, సంగీత్ చౌరస్తా, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, సోమాజిగూడ రాజీవ్ సర్కిల్లో జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. ఈ రహదారుల విస్తరణ పనుల్లో జరుగుతున్న ఆలస్యంతో ట్రాఫిక్ సమస్యలు అధిగమవుతున్నాయి. కమిషనర్, ప్రభుత్వం జోక్యం చేసుకోని రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెంచాలని వాహనదారులు కోరుతున్నారు.