మణికొండ, మార్చి 7 : లేక్ వ్యూ పేరిట నిర్మాణాలు చేస్తున్న ఓ బిల్డర్ అక్రమాల పుట్టను స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు గురువారం తెల్లవారుజామున కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ గ్రామ పెద్దచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఓ బిల్డర్ సుమారు 10 విల్లాలను ఎలాంటి అనుమతులు లేకుండా ‘లేక్ వ్యూ’ పేరిట చేపట్టారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి మద్దతుతో ఈ అక్రమ నిర్మాణాలకు ఊతం పోస్తున్నారు. ఒక్కో విల్లాను సుమారు రూ.20-25 కోట్లకు విక్రయిస్తున్నారు.
ఎఫ్టీఎల్ పరిధిలో చేపడుతున్న నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేయగా కలెక్టర్ స్పందించారు. గురువారం గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షణలో నాలుగు విల్లాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా లేక్ వ్యూ నిర్మాణదారుడు పల్లపు గోవర్ధన్ తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. నేను ఎవరో తెలుసా… సీఎం రేవంత్రెడ్డి కుటుంబం అంతా నాకు క్లోజ్.. నేను తలచుకుంటే నిన్ను గంటలో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తానని చిటికెలు వేస్తూ దబాయించారు. దీంతో తహసీల్దార్, గోవర్ధన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని సముదాయించి నాలుగు విల్లాలను పాక్షికంగా కూల్చి వేసి రెవెన్యూ అధికారులు వెనుతిరిగారు.
నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్ పరిధిలో చేపడుతున్న నిర్మాణాల కూల్చివేతలు ఆపే ప్రసక్తే లేదని, నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్పై చట్టపరపమైన చర్యలు తీసుకుంటున్నామని గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. విలువైన సర్కార్ భూమిని ఆక్రమించి యథేచ్ఛగా విల్లాలు నిర్మించడం, ఆపై ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి దబాయించడం సరికాదన్నారు. సర్కార్ భూముల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.