సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా, అక్రమ పద్ధతిలో ఆయుధాలు కలిగి ఉన్న వారిని ప్రైవేటు సెక్యూరిటీగా నియమించుకోవడంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఇటీవల హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అక్రమ ఆయుధాల రాకెట్ గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో నకిలీ గన్ లైసెన్స్తో ఆయుధాలు ఉన్న విషయం, వాటితో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న ఉదంతం బయటపడింది.
ఈ నేపథ్యంలోనే గురువారం బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఐసీసీసీ), ఆర్బీఐ, బ్యాంకులు, క్యాష్ మేనేజ్మెంట్ సంస్థలు, సెక్యూరిటీ ఏజెన్సీలతో సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు, పీఎస్ఏఆర్ నిబంధనలపై బ్యాంకులు, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు, క్యాష్ మేనేజ్మెంట్ సంస్థలకు, ఆర్బీఐ అధికారులకు జాయింట్ సీపీ రమేశ్ ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
బ్యాంకులు, నగదు రవాణా చేసే కంపెనీలు, బంగారు దుకాణాలు, భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులతో వ్యాపార చేసే సంస్థలు సెక్యూరిటీ గార్డులను నియమించుకునే సమయంలో పాటించాల్సిన ప్రమాణాలు, ఆర్బీఐ నిబంధనలను వివరించారు. అనంతరం సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. సెక్యూరిటీ గార్డులుగా ఎక్స్సర్వీస్ మెన్, ఆర్మూడ్ ఫోర్స్లో పనిచేసిన వారిని నియమించుకోవాలని సూచించారు. ఆయా సంస్థలు నిబంధనల మేరకు గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన వారికి లైసెన్స్ జారీ చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా సెక్యూరిటీ ఏజెన్సీలు, అందులో పనిచేసే సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన నైపుణ్యం, జీతభత్యాలు, శిక్షణ, ఆయుధాల ఉపయోగం.. వంటి అంశాలపై చర్చించారు. రెండు నెలల్లో ఆయా ఏజెన్సీలు ఆయుధ లైసెన్స్ పొంది, ఆయుధాలు సమకూర్చుకోవాలన్నారు. ఆయుధాల ఉపయోగంపై ఐఎస్డబ్ల్యూ నుంచి తగిన సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా లైసెన్స్కు కావాల్సిన డాక్యుమెంట్లు, దరఖాస్తు కాపీలను అందించారు. ఈ సమావేశంలో నగర అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ (ఎస్బీ) విశ్వప్రసాద్, ఇంటెలిజెన్స్ అధికారి కిషన్రావు, తదితరులు పాల్గొన్నారు.