Hyderabad | కొండాపూర్, నవంబర్ 19: ఐటీ కారిడార్కు కేరాఫ్గా ఉన్న గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొండాపూర్ డివిజన్ సిద్ధిక్నగర్లో ఓ నిర్మాణదారుడు కనీస ప్రమాణాలు పాటించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం పుట్టింగుల కోసం తీసిన గుంతల కారణంగా పక్కనే ఉన్న భవనాలను ప్రమాదంలో పడేసింది. ఎటువంటి సెట్బ్యాక్ లేకుండా తీసిన గుంతలతో పక్కనే ఉన్న నాలుగంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది. శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధి.. కొండాపూర్ డివిజన్ సిద్ధిక్నగర్ రోడ్డు నం.1లో ఓ బిల్డర్ 200ల గజాల స్థలంలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణ పనులు చేపట్టాడు. గత వారం రోజులుగా పుట్టింగుల నిర్మాణం కోసం గుంతలు తవ్వి పిల్లర్ల నిర్మాణ పనులు చేపట్టారు.
ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా, కనీస సెట్బ్యాక్లు వదలకుండా గుంతలు తవ్వడంతో పక్కనే ఉన్న ప్లాట్ నంబర్ 1639లోని లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన నాలుగంతస్తుల భవనం పిల్లర్లు బయటకు వచ్చి ఓ పక్కకు ఒరిగింది. భవనంలో ఉంటున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందం, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు ఈ భవనం చుట్టు ప్రక్కల భవనాల ప్రజలను సైతం అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఎలాంటి సెట్బ్యాక్ లేకుండా కేవలం 60గజాల స్థలంలో నాలుగంతస్తుల భవనం నిర్మించగా, దాని పక్కనే మరో వ్యక్తి 200ల గజాల స్థలంలో భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు గుంతలు తవ్వడంతో మొత్తం భవనాలకు ప్రమాదకరంగా మారింది.
అక్రమ నిర్మాణాలను గాలికొదిలేసిన టౌన్ప్లానింగ్ అధికారులు
ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ టౌన్ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు వాపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి సైతం అంజయ్యనగర్, సిద్ధిక్నగర్లో కొనసాగే అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు.