సిటీ బ్యూరో/ ఖైరతాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 7ను రద్దు చేసి, రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థి నేతలపై పోలీసు వాహనం డ్యామేజ్ అయిందన్న నెపంతో సైఫాబాద్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఆ నోటీసులు తీసుకోవడానికి శనివారం బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీష్తోపాటు పలువురు విద్యార్థులు పోలీస్స్టేషన్కు వెళ్లారు. నోటీసులు తీసుకుని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండంతో అక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు హుకూం జారీ చేశారు. వెళ్తామని చెప్తున్నా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తూ వాగ్వాదానికి దిగారు.
ఈసందర్భంగా పడాల సతీష్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా విద్యార్థుల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుa జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు శ్రీనునాయక్, నిఖిల్ పటేల్, కృష్ణ, సుందర్, కిరణ్, మిథున్, నర్సింగ్, అవినాష్, నాగేందర్, విశాల్, రాకేష్ పాల్గొన్నారు.