హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) / అబిడ్స్ : మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో బుధవారం ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించగా, సోమవారం ఏర్పాట్లను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. మత సామరస్యం వెల్లివిరిసేలా రంజాన్ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్, మైనార్టీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్, డైరెక్టర్ షఫీ ఉల్లాఖాన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంకే బద్రుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.