GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : నాణ్యతా ప్రమాణాలను పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపేందుకు బల్దియా ప్రత్యేక డ్రైవ్కు సిద్ధమైంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఆయా సెంటర్లపై తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. వాస్తవంగా కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్లో దాదాపు 12 నుంచి 14 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయిల్ నుంచి మొదలు ఉప్పు వరకు నాణ్యమైన వాటిని వినియోగించి నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్ను అందించాలి. జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన మాంసాన్ని వాడాలి. కానీ నియమ, నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వ్యాపారాలను సాగిస్తున్నారు. వంట గదులు పరిభ్రదత పాటించడం లేదు. ఫుడ్ తయారీలో ప్రతిదీ కల్తీ వస్తువులను ప్రోత్సహిస్తున్నారు. పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు. మాంసం అయితే రోజుల తరబడి ఫ్రిజ్లో పెట్టి దానికి మాసాలాలు దట్టించి.. మరుసటి రోజు వాడుతున్నారు. బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్న సందర్భాలు లేకపోలేదు.
ఈ జాబితాలో చిన్న హోటళ్లు నుంచి బడా హోటళ్ల నిర్వాహకులు ఉంటున్నారు. తరచూ జీహెచ్ఎంసీకి నిత్యం 10 వరకు పైగా ఫిర్యాదులు ఇలాంటివే ఎక్కువగా వస్తున్నాయి. మెరుగైన పౌర సేవలు, ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బల్దియా కల్తీరాయుళ్ల భరతం పట్టాలని నిర్ణయించింది.ఈ మేరకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు తొలుత జరిమానాలు, ఆ తర్వాత సంబంధిత వాటిని సీజ్ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నది. కల్తీ ఉన్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆహార నాణ్యతా ప్రమాణాల విషయంలో అనుమానాలుంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబరు 040- 2111 1111లో సంప్రదించాలని అధికారులు కోరారు. కాగా హాని కలిగించే విధంగా వ్యాపారం చేసిన వారు ఇప్పటికే పలు యాక్టుల కింద కోర్టులో కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 119 సీసీ కేసులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
రోజు వాడే ఆహార పదార్థాలలో కల్తీ జరుగకుండా నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ఫుడ్ సెక్యూరిటీ స్టాండెడ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ మొబైల్ వ్యాన్ రోజుకో సర్కిల్లో ఉండాలి. కానీ గడిచిన కొన్ని రోజులుగా ఈ వాహనం ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వంలో పెద్దల మెప్పు పొందే వీలుగా ఈ వాహనాన్ని కొందరు అధికారులు పక్కదారి పట్టించినట్లు చర్చ జరుగుతున్నది. వెంటనే సర్కిల్లో ఈ వాహనంతో మొదటగా అవగాహన, టెస్టింగ్, ట్రైనింగ్ వీధి వ్యాపారులకు కల్పించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.