కందుకూరు, డిసెంబర్ 29 : ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి ఆ భూములను రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు హాజరయ్యారు. అంతకు ముందు హైదరాబాద్, శ్రీశైలం రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కందుకూరు వరకు మెట్రో తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఫార్మాసిటీ, మెట్రోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం భావ్యం కాదన్నారు. ప్రజాపాలనలో ప్రజలు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను కడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రైతుబంధును ఆపారని, ఇప్పుడు రైతులకు వేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అన్ని పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని చెప్పి ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తరచూ అప్పులంటూ ఆరు గ్యారంటీలు, హామీలను పక్కన పట్టడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
మెగాసిటీ వస్తే యువకులకు ఉద్యోగాలు వస్తాయా ? అని అడిగారు. ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సింహ, జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మీనర్సింహా రెడ్డి, అంజయ్యగౌడ్, బాలకృష్ణ, అధ్యక్షురాలు ఇందిరమ్మ, నాయకులు దేవేందర్, అమరేందర్ రెడ్డి, మహేందర్రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, యూత్ నాయకులు కార్తిక్, విఘ్నేశ్వర్రెడ్డి, దీక్షిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.