Hyderabad | పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనతో పాటు ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు స్థానికంగా వైరల్గా మారాయి. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అధ్యక్షతన ఎల్బీనగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై క్లారిటీ ఇచ్చారు.
ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోందని ఓ విలేఖరి ఈ సందర్భంగా బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దీనికి చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి సెటైరికల్గా స్పందించారు. తనకు కూడా వంద కోట్లు ఇస్తే పార్టీ మారేందుకు రెడీ అంటూ సమాధానం ఇచ్చాడు. మధుసూదన్ రెడ్డి ఇచ్చిన ఈ జవాబు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి రూ.100 కోట్లు తీసుకునే కాంగ్రెస్ పార్టీలో చేరారా? అని గుసగుసలు పెట్టుకుంటున్నారు.