BRS | “బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని నగర బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హెచ్చరించారు. కేసీఆర్ పట్ల రేవంత్రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం నగర వ్యాప్తంగా పలు కూడళ్లలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ముందు సగటు మనిషి అవసరాలు తీర్చాలని, ఆ తరువాత ఏదైనా మాట్లాడుకోవచ్చని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు రేవంత్ రెడ్డికి హితబోధ చేశాయి. సమైక్యాంధ్ర పాలకుల చేతిలో దగాపడిన తెలంగాణను రాష్ట్ర అవతరణ అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అహర్నిషలు అభివృద్ధి కోసం పాటుపడిందని, అది నిజం కాదా? లేక కండ్లు మూసుకుపోయాయా? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్లల్లో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్ చేసిన కృషిని అప్పుడే మరిచిపోయారా? తెలంగాణ ధీరోదాత్తుడు.. కేసీఆర్ అని, దేశంలోనే తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత కేసీఆర్ది కాదా? అంటూ ప్రశ్నించారు. అధికారం ఉంది కదా..! అని అడ్డగోలుగా కేసీఆర్పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి! అంటూ హెచ్చరించారు. కేసీఆర్ సార్ పట్ల మర్యాద లేకుండా మాట్లాడితే.. రేవంత్కు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని, అందుకు సిద్దంగా ఉండమని అన్నారు.”
ఉస్మానియా యూనివర్సిటీ: బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు రమేశ్ గౌడ్, మిథున్, రామకృష్ణ, నాగేందర్ రావు, అవినాశ్, శ్రీను నాయక్, సంపత్, ప్రశాంత్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
షేక్పేట్: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును దుర్భాషలాడిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ ఫిలింనగర్ కొత్త చెరువు సమీపంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు. పార్టీ డివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గౌరీ శంకర్, ఎల్లేశ్, లక్ష్మణ్, రాజ్ కుమార్, కన్నా, సత్యనారాయణ పాల్గొన్నారు.
దుండిగల్: షాపూర్నగర్లోని సాగర్ హోటల్ చౌరస్తాలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, సుభాశ్నగర్ డివిజన్ల అధ్యక్షులు భాస్కర్, అశోక్, శ్రీకాంత్తో పాటు ఎత్తరి మారయ్య, అడ్వకేట్ కమలాకర్, రవి కుమార్, ఇస్మాయిల్, శశి, కిరణ్ పాల్గొన్నారు.