మేడ్చల్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ చేపట్టిన బడి ఈడు పిల్లల గుర్తింపు సర్వేలో గుర్తించిన పిల్లలపై విద్యాశాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గత నెల డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ నెల 10 వరకు నిర్వహించిన సర్వేలో 307మంది పిల్లలను గుర్తించారు. ఎలిమెంటరీ విభాగంలో 6 నుంచి 14 ఏండ్లలోపు, సెకండరీ స్థాయిలో 15 నుంచి 19 ఏండ్లలోపు పిల్లలను వేర్వురుగా గుర్తించి పాఠశాలలో చేర్పించారు. వీరికి 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి వారి ప్రతిభను గుర్తించి వయస్సుకు తగిన విధంగా తరగతులలో చేర్చించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతున్నది.
మరో 21 రోజుల పాటు సర్వే
జిల్లాలో బడి ఈడు పిల్లల గుర్తింపు సర్వే 10 బృందాలతో కొనసాగుతున్నది. మొదట నెల రోజుల పాటు నిర్వహించాలని అనుకున్నప్పటికీ మరో 21 రోజుల పాటు బడి ఈడు పిల్లల గుర్తింపును కొనసాగిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. శిక్షణ తరగతులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించారు.