దుండిగల్, మార్చి 7 : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలే టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టారనే నెపంతో ఇంజినీరింగ్ కళాశాల భవనాలను కూల్చివేతకు శ్రీకారం చుట్టింది. అధికారులు సైతం ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది. గురువారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన కూల్చివేతలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
దుండిగల్లోని చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఐఏఆర్ఈ కళాశాల యాజమాన్యం అక్రమంగా నిర్మాణాలను చేపట్టారనే నెపంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి చెందిన విద్యాసంస్థ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.
చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణలకు సంబంధించి ఇటీవల హైకోర్టు అడ్వకేట్ కమిటీతో పాటు జిల్లా కలెక్టర్ పరిశీలన జరిపిన నేపథ్యంలో కూల్చివేతలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దుండిగల్లోని ఐఏఆర్ఈకు చెందిన ఓ బహుళ అంతస్థుల భవనాన్ని కూల్చివేసేందుకు ఉదయం పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నాయి. భవనాల కూల్చివేతలకు పలు బ్రేకర్లు, జేసీబీలను వినియోగించారు. గ్రౌండ్ఫ్లోర్ మొత్తాన్ని కూల్చివేశారు.
కూల్చివేతలు జరుగుతున్న సమయంలో విద్యార్థులు ఒక్కసారిగా సంఘటనా స్థలానికి దూసుకువచ్చి జేసీబీలకు అడ్డుగా నిలిచారు. ఓ వైపు విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగా కూల్చివేతలు చేపట్టడం ఏమిటని నిలదీస్తూ కూల్చివేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు. అనంతరం కళాశాల తరగతులకు సెలవు ప్రకటింపజేసి విద్యార్థులను అక్కడి నుంచి పంపించారు.
మరోవైపు అప్పటికే అక్కడికి కళాశాల యజమాని, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజు చేరుకున్నారు. అనంతరం గడువు కోరేందుకు అక్కడి నుంచి కలెక్టరేట్కు వెళ్లారు. ఇంతలో మరోసారి అధికారులు పోలీసుల బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు. భవనం రెండో అంతస్థును కూల్చివేశారు.
కళాశాల యాజమాన్యం హైకోర్టులో లంచ్మోషన్ పిటీషన్ దాఖలు చేయడంతో పరిశీలించిన హైకోర్టు జడ్జి తాత్కాలికంగా కూల్చివేతలను నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అక్కడినుంచి వెనుదిరిగారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూల్చివేతలు చేపట్టవద్దని జడ్జి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనను మరిచిందని, సంక్షేమం, అభివృద్ధి అసలే పట్టించుకోకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద్ అన్నారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు మీడియాతో మాట్లాడుతూ దొంగహామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని లేనిపోని అభూత కల్పనలను సృష్టించి ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయించి బెదిరింపులకు దిగుతుందని ధ్వజమెత్తారు.
తాము ఆక్రమణలను సమర్ధించడం లేదని, ఏది ఉన్నా పద్ధతి ప్రకారం చేయాలని తెలిపారు. సోమవారం వరకు కూల్చివేతలు చేపట్టవద్దని స్టాండింగ్ కమిటీ చెప్పినప్పటికీ ఆగమేగాల మీద కూల్చివేతలు చేపట్టడమేమిటని ప్రశ్నించారు. కూల్చివేతల నిలుపుదల కోసం తాము జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వెలితే ఆయన అందుబాటులోకి రాకపోవడం సరికాదని అన్నారు. కలెక్టర్ తమ ఫోన్ ఎత్తకుండా.. కూల్చివేతలు చేపడుతున్న అధికారులతో మాత్రం టచ్లో ఉన్నారని తెలిపారు. ఇదంతా సీఎం రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడా అక్రమనిర్మాణాలు చేపట్టలేదా..? వాటి సంగతి ఏమిటీ? వాటిని ఎప్పుడు కూల్చుతారంటూ ప్రశ్నించారు. గడిచిన 30 ఏండ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి ఇంజినీర్లను తయారు చేస్తున్న ఐఏఆర్ఈ కళాశాలకు అధికారుల నుంచి ఏనాడు ఒక్క నోటీస్ కూడా అందలేదని, కానీ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలైనా కాకముందే కక్ష సాధింపుచర్యలకు దిడగం మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నామని విర్రవీగితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ 1995లోనే 50 ఎకరాలు కొనుగోలు చేశాం. గత 25 ఏండ్ల క్రితమే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే అనుమతులు పొంది కళాశాల భవనాలను నిర్మించి నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాం. పంచాయతీల నుంచి హెచ్ఎండీఏ పరిధిలోకి వెళ్లిన క్రమంలో భవనాల క్రమబద్ధీకరణ కోసం 2015లోనే రూ.95 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నదని చెప్పారు. తాము ఎక్కడా ప్రభుత్వ భూములను ఆక్రమించలేదని, తాము కొనుగోలు చేసిన పట్టా భూముల్లోనే కళాశాల భవనాలన్నీ నిర్మించినట్లు స్పష్టం చేశారు.
వారం కిందట తమకు నోటీసులు ఇవ్వగా దానికి తాము సమాధానం ఇచ్చామని, అయినప్పటికీ కూల్చివేతలు చేపట్టారని తెలిపారు. ఇదే విషయమై కలెక్టర్ను కలిసి కోర్టు ద్వారా పరిష్కరించుకుంటామని తెలియజేసేందుకు వెళితే ఆయన అందుబాటులోకి రాకపోగా మరిన్ని యంత్రాలతో కూల్చివేతలను తీవ్రతరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వం మాపై కక్ష గట్టినందునే ఈ చర్యలకు దిగిందన్నారు.
తాము కళాశాల నిర్మించినప్పటి నుంచి ప్రతి ఏడాది రూ.15లక్షల ఆస్తిపన్ను చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. జడ్జి ఆదేశాల మేరకు స్టాండింగ్ కమిటీ కమిషనర్ మధ్యా హ్నం 12గంటలకు కూల్చివేతలు ఆపాలని అధికారులకు తెలిపినా ఉద్దేశ్యపూర్వకంగానే సాయంత్రం 5 గంట ల వరకు అధికారులు కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అన్యాయంగా కూల్చివేతలు చేపడుతున్నారని, వెంట నే ఆపివేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించగా అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిని కలిసి
విన్నవించారు.