సిటీ బ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): ముందస్తు సమాచారం లేకుండా పేదల ఇండ్లపై మూకుమ్మడి దాడికి తెగబడి రోడ్డు పాలైన బడుగు జీవులపై నేడు కపట ప్రేమ కురిపిస్తున్నారు. చెరువుల పక్కన జీవనం సాగిస్తున్న వారి ఇండ్లను కూల్చి ఏడాదిన్నర పాటు దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసి.. ఇప్పుడు చేరదీస్తామంటున్నారు. పూటకో మాట.. రోజుకో ప్రకటనలతో హైడ్రామా సృష్టిస్తున్నారు. పైకి పేదలకు అన్యాయం జరగనీయమని చెప్తూనే.. వారి ఇండ్లపైకి బుల్డోజర్లను పంపించి రోడ్డున పడేసిన హైడ్రా అధికారులు నేడు వారికి పునరావాసం కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా సున్నం చెరువు, రామంతాపూర్ చెరువు బాధితులతో పాటు ఇతర చెరువుల పరీవాహకంలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తామని హైడ్రా కమిషనర్ ప్రకటించారు.
సొంత ప్లాట్లు కోల్పోయిన వారికి టీడీఆర్ రూపంలో పరిహారం అందిస్తామని తెలిపారు. అప్పటికప్పుడు ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండా బుల్డోజర్లను ఇండ్లపైకి పంపించి అరాచకం సృష్టించిన హైడ్రా అధికారులు ఇప్పుడు హైడ్రామా సృష్టిస్తున్నారు. సున్నం చెరువు, రామంతాపూర్ చెరువు పరీవాహకంలోని ప్లాట్ల యజమానులు కబ్జా చేశారని బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. బతుకుదెరువు కోసం చెరువు పక్కన గుడిసెలు వేసుకుని జీవిస్తున్న బడుగుల బతుకు బుగ్గిపాలు చేశారు. ఏడాదిన్నరగా తీవ్ర వేధింపులకు గురిచేసి ఇప్పుడు ప్రెస్మీట్లు పెట్టి వారికి పరిహారం కల్పిస్తామని చెప్తున్నారు. దీంతో హైడ్రా అధికారులకు ఒక స్పష్టమైన విధానం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లు తమ ఇండ్లు, స్థలాలను వదులుకున్నందుకే కదా నేడు సున్నం చెరువు, రామంతాపూర్ చెరువుల సుందరీకరణ సాధ్యమైంది? వారు సహకరించకుంటే హైడ్రా గొప్పగా చెప్పుకుంటున్న చెరువుల సుందరీకరణ జరిగేదా?
చెరువును ఆక్రమించారనే నెపంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇండ్లను కూల్చి, ప్లాట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ల యజమానులు తమ దగ్గర అన్ని భూహక్కులు ఉన్నాయని నెత్తీనోరు కొట్టుకున్నా వినకుండా బుల్డోజర్లతో విధ్వంసం సృష్టించారు. అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇండ్లను నేలమట్టం చేశారు. పట్టా భూములు, ఇండ్ల స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ముందు యజమానులతో సంప్రదించి వారి అంగీకారంతో భూసేకరణ చేయాల్సి ఉన్నా కనీస నిబంధనలు పక్కనపెట్టి, ప్రజలను బెదింపులకు గురిచేసి లాక్కున్నారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, యజమానులతో సంప్రదించకుండా బుల్డోజర్లను ఇండ్లపైకి పంపి విధ్వంసం సృష్టించారు. హైడ్రా పేరిట సామాన్యుల హక్కులను హరించారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి దౌర్జన్యంగా సామాన్యుల భూములను లాక్కొన్నారు. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లు, కొనుక్కున్న స్థలాలను నిర్దాక్షిణ్యంగా లాక్కున్నారని బాధితులు ఏడాదిన్నరగా కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టి, తమకు న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలని వేడుకున్నారు.
తమ ఇండ్లు, భూములు కోల్పోయామని కంటిమీద కునుకులేకుండా జీవనం సాగిస్తున్నారు. ప్రజల భూ హక్కులపై ఏడాదిన్నరకు హైడ్రాకు కనువిప్పు కలిగింది. పేదలను ఏడాదిన్నరకు పైగా వేధింపులకు గురిచేసి ఏమీ ఎరుగనట్లు ఇప్పుడు ప్లాట్లు, ఇండ్లు కోల్పోయినవారికి టీడీఆర్ రూపంలో పరిహారం చెల్లిస్తామని హైడ్రా కమిషనర్ ప్రకటించారు. ముందుగానే నిబంధనల ప్రకారం భూసేకరణ చేసి వారికి అందాల్సిన పరిహారం నిబంధనల ప్రకారం ఇస్తే పేదల ఉసురు తగిలేది కాదు కదా? ఇప్పటికైనా ప్రకటనలకే పరిమితం కాకుండా బాధితులకు పరిహారం సకాలంలో అందించాలని పలువురు కోరుతున్నారు.
సున్నం చెరువు, రామాంతాపూర్ చెరువు పరిసరాల్లో ఏండ్ల తరబడిగా నివాసముంటున్న బడుగుజీవులపైకి బుల్డోజర్ పంపి విధ్వంసం సృష్టించారు. చెరువును ఆక్రమించారనే నెపంతో సామాన్లు కూడా తీసుకునేందుకు సమయం ఇవ్వకుండా గుడిసెలు, రేకుల ఇండ్లను నేలమట్టం చేశారు. నాడు వారిపై కబ్జాకోరులనే ముద్ర వేసి రోడ్డున పడేశారు. కూలీ పనులు చేసుకుంటూ.. చెత్త సేకరించుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలను దిక్కుతోచని స్థితిలో పడేశారు. కొద్దిపాటి ఆధారాన్ని కోల్పోయి ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో బతుకీడుస్తున్నారు. తాజాగా శుక్రవారం వారితో హైడ్రా కమిషనర్ సమావేశం ఏర్పాటు చేసి డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
చెత్త సేకరణ చేసుకునేవారు కావడంతో నగరంలో ఎక్కడా ఇండ్లు అద్దెకు కూడా దొరకని పరిస్థితిలో వాళ్లున్నారని రంగనాథ్ అన్నారు. వాళ్లందరినీ ఆదుకుంటామని చెప్పారు. వెంటనే మాట మార్చి శనివారం వాళ్లంతా అక్కడ నివసించడానికి పేదరికం కారణం కాదని.. వారి వెనుక కబ్జాకోరులు ఉన్నారని మాట్లాడారు. కబ్జాకోరులకు రూ.50 వేలు చెల్లించి అక్కడ ఉంటున్నారని, ప్రతినెలా రూ.3 వేల చొప్పున వారి వెనుక ఉన్న వారికి చెల్లిస్తున్నారని మీడియా సమావేశంలో చెప్పారు. ఒక్కరోజులోనే పేదల జీవనంపై రెండు మాటలు మాట్లాడటం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేదలు.. చెత్త సేకరణ చేసుకునేవారు.. బతుకుదెరువు కోసం చెరువు చెంతన ఉంటున్నారని.. మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కరోజులోనే మాట మార్చారు. రోజుకో మాట.. పూటకో కామెంట్ చేస్తూ పేదలను కించపరచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.