కవాడిగూడ, సెస్టెంబర్ 4: అనుమానాస్పద స్థితిలో ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. దామోదరం సంజీవయ్యనగర్ బస్తీలో ఉండే లక్ష్మి(55) ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. 24 గంటలు గడిచినా మహిళ ఎక్కడ ఉందో తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రమాదవశాత్తు హుస్సేన్సాగర్ నాలాలో పడిపోయిందేమో.. అన్న అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, డిజాస్టర్ టీం వెతకడం ప్రారంభించారు. సోమవారం ఉదయం నుంచి గాంధీనగర్ ఏసీపీ కందుల రవికుమార్, గాంధీనగర్ ఇన్స్పెక్టర్ నునావత్ రవి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దామోదరం సంజీవయ్యనగర్తో పాటు గాంధీనగర్, అశోక్నగర్, సూర్యానగర్, హిమాయత్నగర్ నాలా వరకు డిజాస్టర్ సిబ్బంది జల్లెడ పట్టారు. అయినా.. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో మరెక్కడికైనా వెళ్లిందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.