సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ): జలమండలిలో కొత్తగా ఎన్ఆర్డబ్ల్యూ (నాన్ రెవెన్యూ వాటర్) విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నగర ప్రజల దాహర్తిని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న నీళ్లు ఎన్ని? ప్రజలకు సరఫరా అవుతుంది ఎంత? బోర్డు వెచ్చిస్తున్న ఖర్చులు ఎన్ని కోట్లు? ప్రస్తుతం బోర్డుకు వస్తున్న రాబడి ఎంత? అనే లెక్కలను తేల్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు జలమండలి కసరత్తును ప్రారంభించింది. నగరానికి తీసుకువస్తున్న నీటిలో సుమారు 38 శాతం నీరు వృథాగా పోతున్నట్లు జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. గతంలో వాక్ కార్యక్రమాన్ని నిర్వహించి, నగరంలో నీటి వృథాపై అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో 40 శాతం నీటి వృథా కాస్త 38 శాతానికి వచ్చిందని, కాని, నీటి వృథాను జీరో చేయాలనే లక్ష్యంతో జలమండలి అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలోని జలమండలి డివిజన్లలో ప్రతి డివిజన్కు ఒక ప్రత్యేక డీజీఎంను నియమిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 15 డీజీఎంలను నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ 15 మందికి ఇప్పటికే ఎన్ఆర్డబ్యూ (నాన్ రెవెన్యూ వాటర్) ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈ 15 మంది డీజీఎంలు నాన్ రెవెన్యూ వాటర్ లెక్క తేల్చనున్నారు. వాస్తవానికి ప్రతి డివిజన్కు డీజీఎంలు ఉంటారు. కాని, వీళ్లు మెయింటనెన్స్ విభాగంలో ఉండటం వలన ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవడం బిల్లుల వసూళ్ల వంటి పనులతోనే సరిపోతుంది. ఈ క్రమంలోనే నీటి వృథాకు సంబంధించిన అంశంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే అపవాదు ఉంది. కొత్తగా ప్రతి డివిజన్కు అదనంగా మరో డీజీఎంను నియమించి వృథా నీటి లెక్క తేల్చేందుకు జలమండలి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్ఆర్డబ్ల్యూలో భాగంగా నియమించిన కొత్త డీజీఎంలు ప్రధానంగా నీటి వృథాతో పాటు వస్తున్న నీరు, సరఫరా అవుతున్న నీరులో ఉన్న వ్యత్యాసం ఎంత? ఈ నీరు ఎక్కడకు పోతుంది? అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ట్యాంకుల/రిజర్వాయర్ల ఓవర్ ప్లో, మీటర్ రిపేర్, లీకేజీలు, అక్రమ నల్లా కనెక్షన్లు, రిజర్వాయర్లకు వస్తున్న నీటి క్వాంటిటీ, సరఫరా అయిన క్వాంటిటీ అంశాలను గుర్తించి ఎప్పటికప్పుడు జలమండలి ఉన్నతాధికారులు ప్రతిపాధనలను పంపుతారు. అలాగే సరఫరా అవుతున్న నీటికి సరిపడా బిల్లులు వసూలు అవుతున్నాయా? లేదా? బడా కమర్షియల్ వినియోగదారులకు ప్రతినెల రూ.లక్షకు పైగా నీటి బిల్లులు వస్తాయి. వీళ్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారా? లేదా? అనే అంశాలపై కూడా ఎన్ఆర్డబ్ల్యూ డీజీఎంలు దృష్టి సారించనున్నారు.
జలమండలి రోజు సుమారు రూ.70 – 80 కోట్ల వరకు ఖర్చుచేసి నీటిని నగరానికి తీసుకువస్తుంది. కాని, ఇందులో 40 – 38 శాతం నీటికి రెవన్యూ రావడం లేదు. అయితే, ఈ నీరు వృథా అవుతుందని చెబుతున్నారు. కాని, వాస్తవానికి ఇంత నీరు ఎటుపోతుందో? మరో రెండు మూడు నెలల్లోనే తేలిపోతుందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం, ఈ అంశాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు డీజీఎంలను నియమించడం వలన పరిస్థితి మెరుగుపడుతుందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు.