IPL | సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) :‘వీ లవ్ ధోని.. వీ లవ్ ధోని’ నినాదాలతో ఉప్పల్ స్టేడియం మార్మోగింది. శుక్రవారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్- హైదరాబాద్-చైన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ప్రత్యేకించి ధోని గేమ్ను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఎండను సైతం లెక్క చేయకుండా క్యూలైన్లో నిల్చొన్నారు.
సాయంత్రం 4 గంటల నుంచే స్టేడియం లోపలికి అనుమతించారు. ఫ్యాన్స్ హంగామాతో ఉప్పల్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు ఐపీఎల్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారంటూ క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి రూపాయల టికెట్ను రూ.6వేలకు పైగా విక్రయించారని ఆరోపించారు.